వర్ని : దళితులు, గిరిజనుల పట్ల ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వర్ని మండల కేంద్రంలో దళిత సంఘాలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్రాసిటి కేసును కించపరుస్తూ అరవింద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలని వర్ని – బాన్సువాడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనగర్ సర్పంచ్ రాజు మాట్లాడుతూ దళితులు, గిరిజనులపై ఎంపీ అరవింద్ నోటికొచ్చినట్లు మాట్లాడారని వెంటనే వాటిని ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన సంఘాల నాయకులు సరిచంద్, పీర్యా, బానోత్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.