కామారెడ్డి దశ మార్చేందుకు సీఎం కేసీఆరే స్వయంగా వస్తుండు. ఎన్నికల్లో కడుపు నిండా ఆశీర్వదించండి. అఖండ మెజార్టీని కట్టబెట్టండి. కామారెడ్డిని అభివృద్ధి చేసే జిమ్మేదార్ నాది అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తరుణంలో ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కేటీఆర్.. మంగళవారం పాత మాచారెడ్డి, పాత కామారెడ్డి మండలాల్లో పర్యటించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్ అన్నట్లు కేసీఆర్ వచ్చినంక అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి రైతుల పాదాలు కడుగుతామని ప్రకటించారు. కామారెడ్డి మాస్టర్ప్లాన్ గురించి రైతులు ఆందోళన చెందవద్దని, దాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. 30 రోజులు కష్టపడండి. గ్రామాల్లో, వాడల్లో చర్చ పెట్టండి. కేసీఆర్ రాకతోని నియోజకవర్గం ఎట్ల అభివృద్ధి చెందుతదో వివరించండని సూచించారు. ఉద్యమ సత్తా చూపించాలని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావాలని పిలుపునిచ్చారు. నవంబర్ 9న కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తారని, ఈ సందర్భంగా నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో ప్రజలంతా హాజరై దీవించాలని కోరారు.
కేసీఆర్ వచ్చాక కామారెడ్డి అభివృద్ధికి నేనే జిమ్మేదార్ని అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. కామారెడ్డిని సిరిసిల్ల్ల కన్నా మక్కువగా చూసుకుంటానని, కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. గంప గోవర్ధన్తో కలిసి కామారెడ్డి నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత ఇరువురిదనే చెప్పారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారని, ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో ప్రజలంతా హాజరై దీవించాలని కోరారు. అఖండ మెజార్టీతో కేసీఆర్ను గెలిపించాలన్నారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లి పోటీచేసినా గెలిచే దమ్మున్న కేసీఆర్.. ఈ కామారెడ్డినే ఎంచుకోవడం ఈ ప్రాంత అదృష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో పాత మాచారెడ్డి, కామారెడ్డి పట్టణం, కామారెడ్డి రూరల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి కీలక ప్రసంగం ఇచ్చారు. ప్రతిపక్షాల తీరును ఎండగట్టా రు. బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదన్నారు. ఈ మధ్యనే ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డిపై ఓ నాయకుడు చేసిన దుర్భషలాటను కేటీఆర్ ప్రస్తావించారు. ఎంతటి వారైనా పార్టీ సిద్ధాంతాల మేరకు నడుచుకోవాలని సూచించారు. లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేత ఎంజీ వేణుగోపాల్ గౌడ్ బీఆర్ఎస్లో చేరారు.
కామారెడ్డి, అక్టోబర్ 31: సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో మరింత అభివృద్ధి చెందుతుందని, భారీ మెజార్టీతో గెలిపించాలని డాక్టర్లు, కుల సం ఘాల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరా రు. పట్టణంలోని శుభం ఫంక్షన్హాల్లో మంగళవారం సమావేశమయ్యారు. కరోనా సమయంలో వైద్యులు అనేక సేవలు చేశారని, వైద్యులపై భౌతిక దాడులు జరగకుండా చట్టాలు తీసుకువస్తామని అన్నారు.
కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ వన్గా అవుతుందని కేటీఆర్ చెప్పారు. కామారెడ్డి పట్టణాన్ని దేశంలోనే నంబర్ వన్ సిటీగా మార్చే బాధ్యతను తానే తీసుకుంటానని చెప్పారు. మాస్టర్ ప్లాన్ను రద్దు చేశామని మరోసారి గుర్తుచేశారు. పాత మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంటుందన్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్పై పోటీ చేయడానికి షబ్బీర్ అలీ భయపడి పారిపోతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొడంగల్లో గెలవని రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాననడం సిగ్గుచేటన్నారు. ఉద్యమ ద్రోహికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కామారెడ్డి ప్రజలంతా బుద్ధి చెబుతారన్నారు. సలాకలు, సిమెంట్ పంపేవారిని నమ్మొద్దని, టక్కుటమారా జిమ్మిక్కులు నడువవు అంటూ బీజేపీకి చురకలు అంటించారు. చాక్లెట్లు, పిప్పరమెంట్లకు ముగ్ధులు కావొద్దని, కేసీఆర్తో దమ్ బిర్యానీ వస్తుందంటూ జోష్ నింపారు. సలాకలు ఇస్తా, సిమెంట్ ఇస్తా ఓటెయ్యండంటే మనమంతా పిచ్చోళ్లమా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి, బీజేపీకి కామారెడ్డి ఉద్యమ సత్తా ఏమిటో చూపెట్టి వారి డిపాజిట్ గల్లంతు చేయాలన్నారు. కాంగ్రెసోళ్లు ఒక్క చాన్స్ ఇయ్యమంటున్నారని, ఇప్పటి వరకు కాంగ్రెసోళ్లకు 11 చాన్సులు ఇచ్చామన్నారు. దేశాన్ని, రాష్ర్టాన్ని నడుపుమని 55ఏండ్లుగా దళితులు, మైనార్టీలు, బలహీనవర్గాలు, బీద, బిక్కి రైతులు ఓట్లేస్తే ఉద్దరించిండ్రా అంటూ మండిపడ్డారు. బార్బార్ మోఖా దియా.. హమ్కో బార్బార్ ఉనోనే దోఖా దియా అంటూ వ్యాఖ్యానించారు. 55 ఏండ్లు సక్కగా కాంగ్రెస్ పాలన ఉండి ఉంటే.. కరెంట్ చక్కగా ఇచ్చి ఉంటే..మంచి నీళ్లు ఇచ్చి ఉంటే.. గోదావరి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తే ఈ సమస్యలు ఉంటుండేనా అంటూ ప్రశ్నించారు. ఒక్క చాన్స్ అంటే నమ్మొద్దు అని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ అయాచితం శ్రీధర్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్, నిట్టు వేణుగోపాల్, ఎంపీపీ నర్సింగరావు, పున్నా రాజేశ్వర్, కేసీఆర్ బావ వకీల్ రామారావు, సుభాష్ రెడ్డి, గంప శశాంక్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మాచారెడ్డి,అక్టోబర్ 31: మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా, ఎక్స్రోడ్ గ్రామంలో రెడ్డిపేట మాజీ సర్పంచ్ నర్సాగౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. పాల్వంచ, ఘన్పూర్, రెడ్డిపేట, అన్నారం గ్రామాల నుంచి దాదాపు 500 మంది నాయకులు కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రానున్న 30 రోజులు అప్రమత్తంగా ఉండాలని, కాకిరిపీకిరి కథలు చెప్పే ప్రతిపక్షాలకు బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. గజ్వేల్ అందంగా మారిందని, అంతకన్నా అందంగా కామారెడ్డి అవుతుందన్నారు. మన ఊర్లు బాగు పడుతాయని, ఆరు నెలల్లోనే సమస్యలు మాయం అవుతాయన్నారు. కామారెడ్డిపై ప్రేమతో కేసీఆర్ వస్తుండని, కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతుల కోరిక మేరకు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకు వస్తామన్నారు. మిగిలిపోయిన గిరిజనులకు పోడు పట్టాలు అందిస్తామన్నారు. మంచిప్ప నుంచి ప్యాకేజీ 22 ద్వారా నీళ్లను తీసుకువస్తామన్నారు. ఐదారు నెలల్లోనే ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకువచ్చి రైతుల పాదాలను కడుగుతామని హామీ ఇచ్చారు. కాలువలు తవ్వేటప్పుడు రైతులంతా సహకరించాలని విన్నవించారు. కేసీఆర్కు భూములు గుంజుకునే అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. మతిలేని ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. కామారెడ్డి బాగుకోసమే కేసీఆర్ వస్తున్నారని చెప్పారు. జల్ జంగల్ జమీన్ అని కొమురం భీమ్ నినాదాన్ని అర్థవంతంగా, ఆచరణలో పెట్టి చూపిస్తున్నది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.
కామారెడ్డి నియోజకవర్గం కోసం మిషన్ భగీరథ పాత పైప్లైన్ స్థానంలో కొత్త పైపులు మార్చేందుకు రూ.195కోట్లు మంజూరు అయ్యాయని కేటీఆర్ అన్నారు. నాలుగైదు నెలల్లోనే పనులు పూర్తిచేస్తామన్నారు. ఎండాకాలంలో గోస లేకుండా తాగు నీరు అందిస్తామన్నారు. బాధ్యత నేనే తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు. ఫరీద్పేటకు చెందిన ముత్యంరెడ్డి అనే ఆఫీసర్ను పెట్టి గజ్వేల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి మోడల్లోనే కామారెడ్డిలోనూ చిటికెలో సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని తెలిపారు. తద్వారా సమస్యలన్నీ సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు. పూర్తిస్థాయిలో సంపూర్ణంగా నిధులిచ్చి వంద రెట్లు అభివృద్ధి చేసే బాధ్యత నాదేనంటూ కుండబద్దలు కొట్టారు. సీఎం కాలు పెట్టగానే అడగకుండానే అయిపోయే పనులు జరిగిపోతాయన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా 30 రోజులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రతి రోజూ మీ గ్రామాల్లో, మీ వాడల్లో చర్చ పెట్టి కేసీఆర్ చేసిన పనులపై వివరించాలన్నారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి నియోజకవర్గానికి జరిగే ఫలితాన్ని వివరించాలన్నారు. సర్వ రోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్లుగా కేసీఆర్ వచ్చినంక అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
2001లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 ఎంపీటీసీ స్థానాలకు తొమ్మిది, జడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసిన ఘనత మాచారెడ్డికి దక్కుతుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఉద్యమాల గడ్డ నుంచి ఉద్యమించిన నాయకుడు సీఎం కేసీఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టమని అన్నారు. 14ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలు తొమ్మిదిన్నరేండ్లు అధికారం కట్టాబెట్టారని వివరించారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ భరోసా పేరుతో ఇటీవల ప్రకటించిన మ్యానిఫెస్టో సామాన్యులకు ఎంతో లబ్ధి చేకూర్చుతుందన్నారు. నెల రోజులపాటు ప్రతి కార్యకర్త, నాయకుడు ఇంటింటికీ తిరిగి సీఎం కేసీఆర్కు భారీగా మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరారు.
మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి, సీఎం కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కామారెడ్డి ఎలా ఉందో ప్రజలు గమనించాలి. జిల్లాగా ఏర్పడిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తున్నారు. మనమంతా కష్టపడి కేసీఆర్ను గెలిపించుకోవాలి.