కామారెడ్డి, జనవరి 25 : బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందగా.. బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆయన నివాసంలో గురువారం పార్టీ ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తండాకు చెందిన అజ్మీరా సీతారాం మృతి చెందగా అతని భార్య మంగ్యాకు చెక్కును అందజేశారు. దోమకొండ మండలం అంబారీపేట్ గ్రామానికి చెందిన సిరికొండ లింగారెడ్డి మృతి చెందగా అతని భార్య సరితకు, మద్దికుంటకు చెందిన గజ్జెల లింగం మృతి చెందగా అతని భార్య తులసమ్మ, కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల లింగం మృతి చెందగా అతని భార్య లావణ్య, తిప్పాపూర్ గ్రామానికి చెందిన ఎల్లవ్వ మృతి చెందగా ఆమె భర్త భిక్షపతికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదవశాత్తు కార్యకర్తలు మృతి చెందితే వారి కుటుంబాలకు పార్టీ బీమా నుంచి ఆర్థికసాయం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నల్లవెల్లి అశోక్, గరెగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.