బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జ్జిలు కార్యకర్తలు, నాయకులతో కలిసి పోతున్నారు. కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న అసత్యప్రచారాలని తిప్పికొట్టి, బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి, మార్చి 25: ప్రజల కోసం పనిచేసేది భారత రాష్ట్ర సమితి ఒక్కటేనని, చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ఎలా ఉన్నది.. ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలకు తెలుసునని చెప్పారు. కామారెడ్డి శివారులోని పొందూర్తిలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ విఠల్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్లాంటి పథకాలతో నిరుపేదలకు కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. కొందరు ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తూ పిచ్చికుక్కల్లా మొరుగుతున్నారని, ప్రతిపక్షాల అబద్ధాలు, అసత్యప్రచారాలను కార్యకర్తలు, నాయకులు తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నా రు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, అందరం కలిసికట్టుగా కేంద్రాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా.. రాష్ట్ర ప్రభు త్వం సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, కామారెడ్డి మున్సిపాలిటీని అద్భుతంగా తీర్చిదిద్దారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ఎంతో కృషి చేశారని అన్నారు. సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ను మళ్లీ అధికారంలోకి తెస్తాయని చెప్పారు.
కార్యకర్తలు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అన్నారు. కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ఈ సమ్మేళనాలు ఉపయోగపడతాయని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ముందే పట్టణంలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 49వార్డుల్లో రూ.145కోట్ల అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. ఇటీవల మరో రూ.25 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.
కామారెడ్డి పట్టణంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు అన్నారు. ఆత్మీయ సమ్మేళనంతో కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందని అన్నారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తొమ్మిదేండ్లలో కామారెడ్డి పట్టణం మున్సిపల్ పరిధిలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, వైస్ చైర్మన్ కుంభాల రవియాదవ్, బీఆర్ఎస్ నాయకులు మామిండ్ల అంజయ్య, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యమ నేత కేసీఆర్ 14ఏండ్లు కొట్లాడి తెచ్చిన తెలంగాణను సీఎంగా తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశారని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారని, 50ఏండ్లు అవకాశమిస్తే దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రగతిభవన్, సెక్రటేరియట్ను కూల్చేస్తామని అంటున్నారని, ఇష్టారీతిన మాట్లాడితే అక్కడే పాతిపెడతామని హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో సచివాలయం నిర్మించామని, బీజేపీ ప్రభుత్వం ఇస్తే కట్టలేదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు అధికారంలోకి వచ్చి, తెలంగాణను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. నాలుగు లైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్తో కామారెడ్డి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. పట్టణంలోని 49 వార్డుల్లో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని వివరించారు. మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ను నిధులు అడిగామని, త్వరలోనే మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు తామే చేశామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా రైతులను రెచ్చగొట్టి 25రోజుల పాటు దీక్ష చేయించి తప్పుడు ప్రచారం చేసిందని వివరించారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ ఇస్తే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని అసత్యప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.