కష్టాల్లో చిక్కుకున్న ప్రజలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. వర్షాలు మిగిల్చిన నష్టాలను పరిశీలిస్తూ అండగా ఉంటామని రైతులకు భరోసా కల్పిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం విస్తృతంగా పర్యటించారు. పొద్దున్నుంచి పొద్దుపోయే వరకూ తిరుగుతూ.. ఐదు మండలాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. పునరుద్ధరణ చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. మాచారెడ్డి మండలంలో దెబ్బతిన్నపంటలు, రోడ్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మాచారెడ్డి, జూలై 29 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శనివారం మండలంలోని అక్కాపూర్, ఉమ్మడి ఎల్లంపేట, ఉమ్మడి సోమార్పేట, రత్నగిరిపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, చెరువు కట్టలు, చెక్డ్యాంలు, పంటలను పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లు, చెరువు కట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు, జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పగడాల బాల్చంద్రం,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.