ఖలీల్వాడి, ఏప్రిల్ 18: లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. ప్రత్యర్థులకు అందనంత వేగంతో ప్రచారంలో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ.. నేడు (శుక్రవారం) ఇందూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నది. మాజీ మంత్రి హరీశ్రావు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలిరానున్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సభ అనంతరం మధ్యాహ్నం నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ వేయనున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి కలెక్టరేట్కు వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత కేసీఆర్ బాజిరెడ్డికి బీఫారం అందజేశారు.
పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో కార్యకర్తలకు ఇబ్బంది కలుగకుండా టెంట్లు వేయించారు. వేదికను ముస్తాబు చేశారు. మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరుకానున్న ఈ సభకు కార్యకర్తలు వేలాదిగా తరలిరానున్నారు.
నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలు రూపొందించింది. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పార్టీ ఇన్చార్జీలను నియమించింది. పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో కలిసి బాజిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డితో పాటు కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు సంజయ్, డాక్టర్ సంజయ్ పార్టీ గెలుపు కోసం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ విజయం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఖలీల్వాడి/కామారెడ్డి, ఏప్రిల్ 18: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన గురువారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, గాలి అనిల్కుమార్కు కేసీఆర్ బీఫామ్లను అందజేశారు. సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, కల్వకుంట్ల సంజయ్, నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు విఠల్రావు, దఫేదార్ శోభ, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, జాజాల సురేందర్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు