జుక్కల్ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభిమాన నేతను చూసేందుకు జనం పొలం గట్ల వెంట నడుస్తూ వచ్చారు. ఎటుచూసినా జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు.
సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వివరించే సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. హన్మంత్షిండేను ఎమ్మెల్యేగా గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చేతులెత్తి మద్దతు పలికారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గులాబీ జెండాలు, కండువాలతో తరలిరావడంతో సభా ప్రాంగణం మొత్తం గులాబీమయమైంది.