నిజామాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి మ్యానిఫెస్టోను ప్రకటించింది. మిగిలిన రాజకీయ పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ తాజాగా సబ్బండవర్గాలకు మేలు చేసే విధంగా రూపొందించిన మ్యానిఫెస్టోను ఆదివారం ప్రకటించారు. మహిళలకు భృతి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఒకటేమిటి అనేక పథకాల సమాహారంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల హామీలు ఆకర్షిస్తున్నాయి. గతంలో చెప్పినవే కాకుండా చెప్పనివి సైతం అమలు చేసి మానవీయ పాలనకు నిదర్శంగా నిలిచారు. అందరికీ మేలు చేసే విధంగా రూపొందించిన మ్యానిఫెస్టోను ప్రకటించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సంబురాలు వెల్లువెత్తాయి. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకొని సంబురాలు నిర్వహించారు.
ప్రజల ఎజెండాతో బీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రజల ముందుకు వచ్చింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు నడుం బిగించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న వేళ.. మిగిలిన రాజకీయ పార్టీల కన్నా మిన్నగా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ అధినేత… తాజా గా మ్యానిఫెస్టోనూ సైతం డిక్లేర్ చేశారు. ఇందులో సబ్బండవర్గాలకు మేలు చేసే హామీలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా అభాగ్యులకు పింఛన్ల పెంపు సాహసోపేతమైన నిర్ణయంగా మేధావులు కీర్తిస్తున్నారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకు రాబోతుండడం బీఆర్ఎస్ మానవీయతకు అద్దం పడుతున్నది. మహిళలకు భృతి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఒకటేమిటి అనేకానేక పథకాల సమాహారంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల హామీలు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే చెప్పినవి చేసి, చెప్పనివి సైతం అమలు చేసి ప్రజలందరికీ ఎంతో మేలు చేసిన సీఎం కేసీఆర్ పరిపాలనను దేశ వ్యాప్తంగా కీర్తిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావడం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగనున్నది. కేంద్ర ప్రభుత్వం అమానవీయంగా ఎల్పీజీ ధరలను పెంచితే అధికారం చేపట్టిన తర్వాత రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పడం బీఆర్ఎస్ పార్టీ గొప్పతనాన్ని చాటుకుంటున్నది. ఇక రైతుల మేలు కోసం పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచడంతో వ్యవసాయం పండుగలా మారనున్నది.
దళితబంధు, రైతుబీమా కొనసాగింపు..
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు ఉంటుందని కేసీఆర్ చెప్పడంతో గిరిజనుల్లోనూ హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో పలువురికి పట్టాలు అందించారు. ఏండ్లుగా పడుతున్న వెతలను ప్రభుత్వం తీర్చింది. హక్కు పత్రాలను అందించి పోడు వ్యవసాయదారుల్లో ధీమాను కల్పించింది. పోడు పట్టాలు అందించడంతోపాటు భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు అమలు చేయనున్నారు. మరోవైపు లంబాడా తండాలు, గోండు గూడెం పంచాయతీలుగా మార్పు సైతం మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పేర్కొన్నది. దళితబంధు, రైతుబీమా వంటి కీలకమైన పథకాలు కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేశారు. రైతుబీమా తరహాలోనే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా పేరుతో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికీ ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా అందించబోతున్నారు. ఆరోగ్య శ్రీ గరిష్ఠ పరిమితి రూ.15లక్షలకు పెంచుతున్నట్లుగా బీఆర్ఎస్ అధినేత చెప్పారు. మూడోసారి అధికారంలోకి రాగానే ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను కొనసాగించడంతోపాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని కేసీఆర్ చెప్పడంతో అందరిలోనూ నమ్మకం కుదిరింది.
రైతు బాంధవుడు కేసీఆర్..
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ మరోసారి రైతులకు శుభవార్త చెప్పారు. రైతుబంధు కింద ఎకరానికి రూ.10వేల చొప్పున ప్రతి సంవత్సరం సాగు ఖర్చుల నిమిత్తం అందిస్తున్నారు. ఈ ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఎన్నికల హామీలో నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 60 నుంచి 70శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పదేండ్లలో వ్యవసాయ స్థిరీకరణ విజయవంతంగా అమలు చేయగా ఉత్పాదకతను పెంచుకుంటూ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ యోచిస్తున్నది. రైతుబంధు పథకాన్ని రూ.16వేలకు పెంచుతూ ఎన్నికల హామీని ప్రకటించింది. ఇది కూడా మొదటి ఏడాది రూ.12వేలు పెరుగుతుంది. ప్రతి ఏడాది కొంత పెరుగుతూ ఐదో ఏడాదికి రూ.16వేలకు చేరుకుంటుంది. 2018, మే 10న మొదలైన రైతుబంధు పథకం విజయవంతంగా ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో పథకం ప్రారంభమైన సమయంలో 2.39లక్షల మంది రైతులున్నారు. ఈ సంఖ్య ఇప్పుడు 2లక్షల 60వేలకు చేరింది. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 42వేల మంది నుంచి ఇప్పుడు 2లక్షల 75వేల మందికి పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల మందికి రైతుబంధు సాయం అందుతున్నది. ప్రతి సీజన్లో రూ.500 కోట్లు పెట్టుబడి సాయంగా వెచ్చిస్తున్నది.
మహిళలకు సౌభాగ్యలక్ష్మి..
సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతినెలా రూ.3వేల చొప్పున భృతి చెల్లించబోతున్నారు. అర్హులైన పేదలతోపాటు అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.400కే గ్యాస్ సిలిండర్ సైతం అందించబోతున్నారు. ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తింపజేయనున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో ఆ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ తదితర విధానాలను యధాతథంగా కొనసాగించబోతున్నారు. తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేయబోతున్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత పుట్లకొద్దీ వడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దండిగా ధాన్యం రాశులు వస్తుండడంతో మన భూముల్లో పండిన పంటను మర ఆడించిన తర్వాత ఇక్కడే ప్రజలకు అందించేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేయబోతున్నది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తారు. అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పడంతో సంబంధీకుల్లోనూ సంతోషం కనిపిస్తున్నది.
ఆసరా.. అద్భుతం..
ఆసరా పింఛన్లను మూడోసారి వచ్చే ప్రభుత్వంలో రూ.5వేలకు పెంచబోతున్నట్లుగా కేసీఆర్ చెప్పడంతో అభాగ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ స్కీమ్లో భాగంగా వచ్చే ఏడాది మార్చి తర్వాత రూ.3వేలు అమలు చేయబోతున్నారు. ప్రతి ఏడాది రూ.500 చొప్పున పెంచుతారు. ఐదో సంవత్సరం నాటికి రూ.5వేలు ఇస్తారు. మొదటగా రూ.వేయి పెంచి ఇవ్వడంతోపాటు ఏటా రూ.500 చొప్పున పెంచి ఇవ్వబోతున్నారు. అచ్చంగా ఇలాగే దివ్యాంగుల పింఛన్ను అమలు చేయబోతున్నారు. ఇటీవలే దివ్యాంగులకు పింఛన్ను రూ.4వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది. వీరికి రూ.6వేలు అందివ్వబోతున్నారు. మార్చి తర్వాత రూ.5వేలు అందిస్తారు. ప్రతి ఏటా రూ.300 పెంచుకుంటూ ఐదో సంవత్సరం నాటికి రూ.6వేలు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ప్రతినెలా రూ.60కోట్ల మేర 3లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఇందులో దివ్యాంగులు 20వేల మంది వరకు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో లక్షా 80వేల మందికి పింఛన్లు అందుతుండగా రూ.35కోట్లు ప్రతి నెలా వెచ్చిస్తున్నారు. ఇందులో 19వేల మంది దివ్యాంగులు ఉన్నారు.
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో అద్భుతం. సంక్షేమ పథకాల అమలుతో కేసీఆర్ పాలన రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతుంది. రాష్ట్ర సంపదను పెంచి, ఆ సంపదను పేదలకు పంచుతున్నారు. ప్రస్తుత పథకాలకు అదనపు పెంపుతోపాటు నూతన పథకాలను మ్యానిఫెస్టోలో పొందుపర్చడం హర్షణీయం. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన పథకాలు ఎంతో గొప్పవి. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించి, తమ భవిష్యత్తు కోసం ఓటు వేసి ఆశీర్వదించాలి.
– పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్
మ్యానిఫెస్టో అదుర్స్..
ఖలీల్వాడి, అక్టోబర్ 15: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో బాగున్నది. రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.3వేలు, తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులందరికీ బీమా సౌకర్యంతోపాటు సన్నబియ్యం పంపిణీ లాంటి అంశాలు పేదలకు మేలు చేసేవే. అన్నివర్గాలకూ సంక్షేమ పథకాలు అందేలా రూపొందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– దాదన్నగారి విఠల్రావు, జడ్పీ చైర్మన్