ఆర్మూర్/నిజాంసాగర్/ఎల్లారెడ్డి, జూలై 13 : వ్యవసాయరంగానికి సరఫరా అవుతున్న 24 ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ తీరుపై మూడో రోజైన గురువారం సైతం నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రాలు, సబ్ స్టేషన్ల ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళనలు చేపట్టిన రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రేవంత్రెడ్డికి చంద్రబాబు గతే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పట్టిన గతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పడుతుందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. జీవన్రెడ్డి నాయకత్వంలో గురువారం వందలాది మంది రైతులు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి ఆర్మూర్ పట్టణం జిరాయత్నగర్ కాలనీలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట దహనం చేసి పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ…..తెలంగాణ రైతులతో, సీఎం కేసీఆర్తో పెట్టుకున్నోళ్లెవరూ తట్టుకోలేరని మట్టికొట్టుకుపోతారని హెచ్చరించారు. నాడు చంద్రబాబునాయుడు ప్రభు త్వం తెలంగాణ రైతులకు అరిగోస పెట్టిందన్నారు. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనని.. రెండూ తెలంగాణ వ్యతిరేక పార్టీలేనన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు పల్లెలోకి వస్తే పాతేస్తామంటూ రైతులు నినాదాలు చేశారు.
కాంగ్రెస్ను తరిమికొడదాం..
రైతు వ్యతిరేక కాంగ్రెస్ను తరిమికొడదామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే పిలుపునిచ్చారు. జుక్కల్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయ న పాల్గొని ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి ఇప్పు డు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నాడని రానురాను అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు కూడా బంద్ చేస్తాడని ఫైర్ అయ్యారు. పేదలు, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నాయకులు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీ రామరక్ష అన్నారు.
అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదు.
రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ హెచ్చరించారు. గురువారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి రైతులందరితో కలిసి ఆయన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టా రు. ర్యాలీ తెలంగాణతల్లి ప్రాంగణం వద్దకు చేరుకోగానే రైతుద్రోహి, రైతు సంక్షేమ వ్యతిరేకి రేవంత్రెడ్డి అటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ……తెలంగాణ సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం వైపు దృష్టి సారించారన్నారు. రైతు రాజు అయితే రాష్ట్రమంతా మంచిగుంటదనే ఆశయంతో 24 గంట లు నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందజేస్తున్నా రు.రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ఆందోళనలో ఉన్న రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. రైతు క్షేమమే.. రాష్ట్ర క్షేమమనే విషయాన్ని విస్మరించిన రేవంత్రెడ్డిని, కాంగ్రెస్పార్టీని రైతులు బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.