BRS | గులాబీ జెండాకు దండిగా ప్రజా మద్దతు వెల్లువెత్తుతున్నది. ఊరూరా అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సంఘాలకు సంఘాలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కారుకే మా ఓటు అని బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. కారు జోరుకు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే కుదేలవ్వగా, ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సగం మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని దుస్థితిలో ఆ పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఎలక్షన్లకు మరో 40 రోజులే మిగిలి ఉన్న తరుణంలోనూ అభ్యర్థులను ఖరారు చేయని ఆ రెండు పార్టీలను జనం దేకడమే లేదు. రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడకి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వాల తీరుతో విసిగిపోతున్న దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు. ఉద్యమ పార్టీకి జైకొడుతున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట. ఆది నుంచి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకే ఇక్కడి ప్రజలంతా జై కొడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తీరు ప్రస్ఫుటంగా కొనసాగబోతున్నది. నవంబర్ 30న జరిగే పోలింగ్కు భారత రాష్ట్ర సమితి సర్వంసన్నద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ రాకమును పు నుంచే ఎన్నికల కదనరంగంలో దిగి ప్రజల్లోకి వెళ్తున్నది. నిత్యం ప్రజల్లోనే ఉంటూ బీఆర్ఎస్ శ్రేణులంతా కారు గుర్తుకే ఓటేసే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. జోరుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్, బీజేపీలు డీలా పడి పోయాయి. అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే అభ్యర్థులంతా జోరుగా ప్రచార పర్వాన్ని చేపడుతున్నారు. ఖాళీ సమయం అన్నది లేకుండా జనంలో కలియ తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తుండడంతో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తున్నది. అక్టోబర్ 15న సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను కర పత్రాల రూపంలో ఇంటింటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు చేరవేస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాల సరళిని వివరిస్తూ గులాబీ దళం ముందుకు సాగుతున్నది. ఆసరా పింఛన్ల మొత్తం పెంపు, రైతుబంధు పెట్టుబడి సాయం రూ.16వేలు, కేసీఆర్ బీమా… ప్రతి ఇంటికి ధీమా వంటి విప్లవాత్మకమైన పథకాలపై ఇప్పటికే జనాల్లో చర్చ మొదలైంది. బీమా పథకంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మహిళా భృతి అంశంపైనా అనుకూలతలు ఏర్పడ్డాయి. మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను ఇంటింటికెళ్లి ప్రచా రం చేస్తున్నారు. గులాబీ శ్రేణుల రాకతో గ్రామాల్లో సందడి నెలకొంటున్నది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులైతే కనీసం కదనరంగంలో అడుగు పెట్టి ఓట్లు అడిగే పరిస్థితి కూడా వారికి క్షేత్ర స్థాయిలో లేకపోవడం విడ్డూరంగా మారింది. జనం నుంచి బీఆర్ఎస్కు వస్తున్న స్పందనను చూసి ప్రతిపక్ష పార్టీలు కుదేలవుతున్నాయి.
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వయం గా గులాబీ దళపతి, సీఎం కేసీఆరే పోటీ చేస్తుండడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అయిపోయాయి. కామారెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్కు పెట్టని కోటగా నిలిచింది. అలాంటి గడ్డపై నుంచి స్వయంగా కేసీఆర్ వచ్చి పోటీ చేస్తుండడంతో ఉద్యమ కాలం నాటి సంగతులను ఇక్కడి ప్రాంత వాసులంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నిలబెట్టడంలో ఉద్యమ కాలంలో కామారెడ్డి సైతం వేదికగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడానికి ఈ ప్రాంతం వేదికైంది. నాడు కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజల మద్దతు పెద్ద ఎత్తున దక్కింది. ఇప్పుడు కూడా అదే స్థాయి లో ప్రజల మద్దతు ఉండబోతున్నది. ఇందులో భాగంగానే వందలాది గ్రామాల్లో స్వచ్ఛందంగా కేసీఆర్కు జై కొడుతూ కుల సంఘాల వారీగా తీర్మానాలు సైతం చేశారు. కేసీఆర్కే మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ సైతం చేశారు. ఎన్నికల షెడ్యూల్కు ముందు వరకు జీపీల వారీగా తీర్మానాలు జరిగాయి. ఏకబికిన మద్దతు రావడంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా కుంగిపోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారన్న విషయం ఖరారు కావడంతోనే బీఆర్ఎస్ విజయం ఖాయమైందని మెజారిటీ కోసమే ప్రయత్నం జరుగుతుందంటూ అంతటా ప్రజలంతా గుసగుసలాడుకుంటున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి విరామం లేకుండా ప్రజల మధ్యే తిరుగుతున్నారు. జుక్కల్లో హన్మంత్ షిండే, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
నిజామాబాద్ జిల్లాలోనూ ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా జోరుగా సాగుతున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు గులాబీ పార్టీ విజయం కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. వాహనాల ర్యాలీలతో పాటుగా సోషల్ మీడియాలోనూ జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులపై పెద్ద ఎత్తున ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేస్తూ ఇంటింటికీ కేసీఆర్ పరిపాలన గొప్పతనాన్ని వివరిస్తున్నారు. బా ల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే జోరుగా ప్రచా రం చేశారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం కలగడంతో కాసింత బ్రేక్ పడింది. కొద్ది రోజుల్లోనే వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. ఇందుకు సంబంధించిన పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. బోధన్లో ఎమ్మెల్యే షకీల్ ఆయన భార్య ఫాతిమా ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్లో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డివిజన్ల వారీగా ప్రచారం చేస్తుండడంతో పాటు కుల సంఘాలతో ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ రూరల్లోనూ జోరు కనిపిస్తోంది. నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇన్చార్జీగా నియమితులైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రసంగిస్తూ జాతీయ పార్టీల తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్నారు.