పిట్లం, జనవరి 29: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దిమ్మతిరిగేలా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరీ గార్డెన్లో సోమవారం నిర్వహించిన జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సన్నాహక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భా గంగానే నష్టం జరిగిన చోట సరిదిద్దుకునే విధం గా రాష్ట్రమంతటా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. వచ్చే ఏప్రిల్లో నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఢిల్లీలో తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడుతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిందని, వాటిని అమలుచేయాలంటే ఏడాదికి రూ.1.30 లక్షల కోట్లు అవసరమవుతుందని తెలిపారు. కాంగ్రెస్పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలుచేయాలంటే వీటికి రూ. 4 లక్షల కోట్లు ఏడాదికి కావాల్సి ఉందని, ఆలోచన లేకుండా ప్రజలను మభ్యపెట్టి గెలిచారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటికే యాసంగికి పెట్టుబడి సాయం అందించేవారని తెలిపారు. రాష్ట్రంలో కరెంటు కోతలు సైతం మొదలయ్యాయని పేర్కొన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి మధ్య 1.80 శాతం మాత్రమే తేడా ఉందని, ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్రంలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన నియోజకవర్గం జుక్కల్ అని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే షిండే ప్రతి శాఖ మంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకువచ్చి జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఇలాంటి నాయకుడు ఓడినప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటూ సేవ చేయడం కార్యకర్తల అదృష్టమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. నియోజకవర్గంలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో తొమ్మిదిన్నరేండ్లలో చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ వారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. పదేండ్ల క్రితం నియోజకవర్గం ఎలా ఉండేది, తాను అధికారం చేపట్టాక ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలని కోరారు. పూర్తికాని అభివృద్ధి పనులపై ప్రస్తుత ఎమ్మెల్యేను నిలదీయాలని సూచించారు. తాము నిర్మించిన భవనాలకు వారు ప్రారంభోత్సవం చేస్తూ, తామే నిర్మించినట్లు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. సమావేశంలో ఎంపీ బీబీపాటిల్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదర్ రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.