నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి, విద్యాసాగర్రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఖలీల్వాడి, ఏప్రిల్ 19: సీఎం రేవంత్రెడ్డి, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పి ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, హస్తంపార్టీ అభ్యర్థిగా జీవన్రెడ్డిని నిలబెట్టి అర్వింద్ను గెలిపించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీల నిజస్వరూపం గమనించాలని ప్రజలకు సూచించారు. గత లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ వంద రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి రైతులను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాండ్ పేపర్ రాసి వంచించిన ఘనుడు అర్వింద్ అని విమర్శించారు. ఐదేండ్లు దాటినా పసుపు బోర్డు జాడలేదన్నారు. పసుపు రైతులను తీసుకెళ్లి నామినేషన్ వేస్తానని డ్రామాలు చేశాడన్నారు. కాంగ్రెస్, బీజేపీలను బొందపెట్టి, బీఆర్ఎస్ అభ్యర్థి, ఫైటర్ బాజిరెడ్డి గోవర్ధన్ను ఆశీర్వదించాలని వేముల కోరారు
-మాజీ మంత్రి మహమూద్ అలీ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలను కష్టాల్లోకి నెట్టేలా మార్పు తీసుకొచ్చిందని మాజీ మంత్రి మహమూద్ అలీ ఎద్దేవా చేశారు. పొరపాటున బీఆర్ఎస్ను ఓడగొట్టుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం తప్ప చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగల పార్టీ అని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరెంట్ పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు ఎందుకు పోతున్నదని ఆయన ప్రశ్నించారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వమున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రేవంత్రెడ్డి ఝూటాకోర్ అని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ను మరోసారి నమ్మితే చెవిలో కమలం పువ్వు, నెత్తిన చెయ్యిపెట్టి నిండా ముంచుతారని అన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన పసుపు బోర్డు ఎటు పోయిందని ప్రశ్నించారు. పొద్దున లేస్తే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, హిందూ, ముస్లిం వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టడమే తప్ప ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. మోదీ.. పేదలకు పంచుతానన్న నల్లధనం ఎటుపోయిందని ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు ఎంపీలుగా పనిచేసి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. అందుకే అర్వింద్ గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజలు తిరగబడి తరిమికొట్టారని గుర్తుచేశారు. జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా ఏనాడైనా జిల్లాకు వచ్చాడా అని బాజిరెడ్డి ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ఝూటాకోర్ అని, దొంగ హామీలిచ్చి గద్దెనెక్కారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినవెంటనే రుణమాఫీ చేస్తానన్న రేవంత్రెడ్డి.. 135 రోజులు గడుస్తున్నా అమలు చేయలేదని, పంద్రాగస్టు వరకు మాఫీ చేస్తామని మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తనను 40 ఏండ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకే రాజకీయాల్లో ఉంటూ సేవచేస్తున్నానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
బాజిరెడ్డి గోవర్ధన్ గెలవడం ఖాయమని, అందుకే ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తామందరం వచ్చామని మాజీ మంత్రి గంగుల అన్నారు. బాజిరెడ్డిని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించలేదని ప్రజలను అడిగితే.. ఎంపీగా గెలిపించుకుంటామని అనడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చిన్న సమస్య కూడా తలెత్తలేదని గుర్తుచేశారు. రైతులకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేక దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు.
కరెంటు అప్పుడెట్ల ఉన్నది..
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతరాయం లేకుండా వచ్చిన కరెంటు ఇప్పుడెందుకు పోతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కరెంటు, సాగునీరు లేక రైతులు గోస పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులను రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు.
ప్రధాని మోదీ ప్రకటించిన పసుపు బోర్డు ఎప్పుడు ప్రారంభమయ్యే తేదీ ఎవ్వరికీ తెలియదని రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి ఎద్దేవా చేశారు. బోర్డు తెస్తానని ఐదేండ్లపాటు రైతులను మోసం చేసిన అర్వింద్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బాజిరెడ్డిని గెలిపిస్తే కొట్లాడి పసుపు బోర్డును తీసుకువస్తారని తెలిపారు. కాంగ్రెస్ను నమ్మిన ప్రజలు నేడు కరువుతో అల్లాడుతున్నారని అన్నా రు.