ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో గాలిదుమారం అతలాకుతలం చేసింది. బాన్సువాడ మండలం బోర్లం, బుడ్మి, తాడ్కోల్, కొత్తాబాది తదితర గ్రామాల్లో ఈదురుగాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఒక్కసారిగా బలమైన గాలులు వీచడంతో బోర్లం గ్రామంలో 15 గృహ, 10 వ్యవసాయ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సుమారు 20ఇండ్ల వరకు ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. బాన్సువాడ- కామారెడ్డి ప్రధాన రహదారిపై కొయ్యగుట్ట వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడింది.
కోటగిరి మండల కేంద్రంలోని సర్కారు దవాఖాన సమీపంలో ఉన్న చెట్టు కొమ్మ పడడంతో చెట్టు కింద ఉన్న యువకుడు గమనించి పరుగులు తీశాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. రుద్రూర్ మండల కేంద్రంలో చెట్లు విరిగిపడి ఇండ్లు ధ్వంసమయ్యాయి. అక్బర్నగర్లో ప్రధాన రహదారిపై చెట్టు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంబంలో చెట్టు విరిగి ఇల్లు మీద పడింది. విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అంబం శివారులో భారీ వృక్షం కూలి ఒక ఆటో, రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.