చందూర్/ ధర్పల్లి/ రుద్రూర్/ ఇందూరు/బోధన్ రూరల్/ఎడపల్లి/ముప్కాల్/ఆర్మూర్/శక్కర్నగర్, జూలై 24 : జిల్లాకేంద్రంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్ పాల్గొని పోచమ్మగల్లీలోని పెద్దపోచమ్మ, ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు చేసి బోనం సమర్పించారు. చందూర్ మండలకేంద్రంలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. డప్పువాయిద్యాల మధ్య బోనాలను గ్రామంలో ఊరేగించి పోచమ్మకు సమర్పించారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం కుటుంబీకులతో కలిసి వనభోజనాలకు తరలివెళ్లారు.
ధర్పల్లి మండలంలోని కేశారంలో పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. పోచమ్మకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగీతాభాస్కర్, గ్రామపెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలం చిక్కడ్పల్లిలో వీడీసీ ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. చిక్కడ్పల్లి క్యాంపు నుంచి పాత గ్రామంలోని పోచమ్మ, పెద్దమ్మ ఆలయాల వద్దకు డప్పువాయిద్యాల మధ్య బోనాలను ఊరేగించారు. అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలను సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడు నక్క మక్కయ్య, కార్యదర్శి రాజయ్య, సర్పంచ్ పుష్పలతారమేశ్, ఉపసర్పంచ్ చింతల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
బోధన్ మండలంలోని అమ్దాపూర్, పెగడాపల్లి గ్రామాల్లో బోనాల పండుగను నిర్వహించారు. అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్ మంజుల, టీఆర్ఎస్ మండల కార్యదర్శి సుదర్శన్, వీడీసీ చైర్మన్ జయనాగయ్య, ఉపసర్పంచ్ రాధాకృష్ణ, ఎంపీటీసీ అంజమ్మ, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఎడపల్లిలో శ్రీరామ మఠం ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్ గ్రామదేవతలకు ఒడిబియ్యం, గాజులు, నైవేద్యం సమర్పించి పూజలు చేశారు.
ఎంపీటీసీ సభ్యురాలు మనీషారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. ముప్కాల్ మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో మహిళలు గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న స్మైల్స్ పాఠశాలలో బోనాల సంబురాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ షబానా గోహార్, డైరెక్టర్ రఫీ గోహార్, ఉపాధ్యాయులు సిందూర, సవిత, హరిత, విమల, ప్రసన్న, లలిత, విద్యార్థులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లో బోనాల పండుగను కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో పోచమ్మ ఆలయానికి వచ్చి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.