బోధన్, ఫిబ్రవరి 11: ప్రభుత్వ పాలనను ప్రజల చేరువకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొత్త మండలాలను ఏర్పాటుచేశారని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. కొత్తగా ఏర్పాటైన సాలూరా మండలాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మండలాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లేవారి సమయం వృథా కావడంలేదన్నారు. బోధన్ రాష్ట్రంలోనే పెద్ద మండలం అని తెలిపారు. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఉండడంతో ఈ మండలాన్ని విడదీసి కొత్త మండలంగా సాలూరాను ఏర్పాటు చేశారని వివరించారు.
సాలూరా మండల ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని రైతుల భూముల విలువ ఎంతో పెరుగుతుందన్నారు. కొత్త మండలం సాలూరాను ఏర్పాటుచేసినందుకు సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మండలానికి కూడా బీఆర్ఎస్ మండల కమిటీని ఏర్పాటుచేస్తామని అన్నారు. సాలూరా మండలానికి ఆనుకుని ఉన్న మహారాష్ట్రలో బీఆర్ఎస్కు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. ఈ నెల 5వ తేదీన నాందేడ్లో బీఆర్ఎస్లో చేరికల కోసం సమావేశం ఏర్పాటుచేయగా, తీరా అది ఒక పెద్ద సభగా మారిందన్నారు. 35 వేల మంది తరలివచ్చారన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు పెరుగుతుందని, తెలంగాణలోని సంక్షేమ పథకాలు, రైతులను ఆదుకుంటున్న తీరు ఇతర రాష్ర్టాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కొత్త మండలం తహసీల్దార్గా మమత సాలూరా కొత్త మండలం తహసీల్దార్గా మమత నియమితులయ్యారు. ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.