ఖలీల్వాడి, జనవరి 25 : అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని నగర మేయర్ నీతూకిరణ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని గంగస్థాన్లో ఉన్న కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని ఆమె బుధవారం పరిశీలించారు. నగరంలో మొత్తం 13 సెంటర్లలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మేయర్కు డీఎంహెచ్వో సుదర్శనం కంటి పరీక్షలు నిర్వహించారు.
జిల్లాకేంద్రంలోని కుమార్గల్లీలో రూ. 20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను నగర మేయర్ నీతూకిరణ్.. స్థానిక కార్పొరేటర్ కల్పనామల్లేశ్తో కలిసి బుధవారం ప్రారంభించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సహకారంతో నగరంలోని అన్ని డివిజన్లలో అంతర్గత డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.