రాష్ట్ర ప్రజలను నిరాశ పర్చిన ప్రధాని మోదీ ప్రసంగం
తెలంగాణ అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులకు మతి భ్రమించింది
విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి
బీర్కూర్, జూలై 4: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంకల్ప సభకు విచ్చేసిన ప్రధాని మోదీ దేశానికి రక్షకుడిగా మాట్లాడలేదన్నారు. ఆయన ప్రసంగం విన్న రైతులు, ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. ఆయన ప్రసంగం మొత్తం డబ్బాలో రాళ్లను వేసుకొని గలగలా చప్పుడు చేసిన మాదిరిగా ఉన్నదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తుందని, తమ పార్టీ నాయకుడే సీఎం అవుతాడని సొంత డబ్బా కొట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ నాయకులకు మతి భ్రమించిందన్నారు. దీంతో ఏం మాట్లాడాలో తోచక ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలో కూ డా సీఎంను మారుస్తామని, ఇక్కడ కూడా బీజేపీ పాలన వస్తుందని పగటి కలలు కంటున్నారని అన్నారు. ఆ పార్టీ నాయకులు మరోసారి తెలంగాణలో వారి ఎమ్మెల్యేల స్థానా లు ఎన్నో తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా, ప్రధానిని పదిసార్లు తెలంగాణకు తెచ్చినా, ఎంతమంది కేంద్ర మంత్రులను చక్కర్లు కొట్టించినా ఎలాంటి ఫలితం ఉండదన్నారు. వారికి తెలంగాణ ప్రజల సాధక బాధకాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల పథకాలను అమలు చేసి తెలంగాణ గురించి మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఇద్ద రు ఎంపీలు ఒకరు బండి, మరొకరు గుండు అని, వీరు పార్లమెంటులో తెలంగాణ ప్రజల గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు. కులమతాలను రెచ్చగొట్టి అన్నదమ్ముల మాదిరిగా ఉన్న మనమధ్య చిచ్చు పెట్టడానికే చూస్తున్నారని ఆరోపించారు. పది లక్షల మందితో సభ నిర్వహించామని చంకలు గుద్దుకుంటున్న బీజేపీ సభలో లక్ష మంది కూడా హాజరు కాకపోవడం వారిపై వ్యతిరేకతకు నిదర్శనమన్నా రు. ప్రజలను రెచ్చగొట్టడం మాని, ప్రజలకు సేవ చేయడం ముందుగా నేర్చుకోవాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకులను తరిమి కొడతారని హెచ్చరించారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్లు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.