Bigala Ganesh Guptha | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన 100 కోట్ల నిధులు ధన్ పాల్ సూర్యనారాయణ నేను తెచ్చినవే అని ప్రచారం చేసుకోవడం సబబు కాదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ప్రశ్నించారు. తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాల వేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం అయ్యిందంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా అని.. తెలంగాణ ప్రజల దశాబ్దాల వాంఛ నెరవేరిన సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి, స్వేచ్ఛ వాయువులను పొందిన సందర్భంగా బెలూన్ గాల్లో వదిలారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసి కేసీఆర్ సాధించిన తెలంగాణలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో..
ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ మాట్లాడుతూ.. 29 నవంబర్ 2009వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ దీక్షను భగ్నం చేయడానికి అక్రమంగా అరెస్టు చేసినా నిరాహార దీక్షను కొనసాగించి ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమని ఏ ఇతర ప్రత్యామ్నాయాలు అవసరం లేదని దీక్ష చేపట్టారన్నారు.
రోజురోజుకు క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల దశాబ్ధాల కాల పోరాటానికి తల వంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ఈ రోజు తెలంగాణ విజయ్ దివస్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇటీవలే మాట్లాడుతూ..TUFIDC నుండి 100 కోట్లు నిధులు తీసుకువచ్చానని ప్రకటించారు. కానీ అవి ఆయన తెచ్చినవి కాదని.. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జీజీ కాలేజీ గ్రౌండ్ మీటింగ్లో నిజామాబాద్ పట్టణ అభివృద్ధి పనులకోసం 100 కోట్ల నిధులు ప్రకటించారు.
ఆ తరువాత జీవో కాపీ వచ్చిన వెంటనే నిజామాబాద్ పట్టణంలో RR చౌరస్తా నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించాం.
దాదాపు 90 శాతం పనులకు భూమిపూజలు చేసాం, కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మా హయాంలో తెచ్చినటువంటి 100 కోట్ల నిధులు తాను తెచ్చానని చెప్పుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో సుమారు 100 కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చి నగర అభివృద్ధి చేస్తున్నట్టు చేసిన ప్రకటనలను ఖండించారు.
ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేయాలి..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మా హయాంలో మంజూరు చేసిన 100 కోట్ల నిధులతో నగరంలోని 60 డివిజన్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వాటికి పునాదులు వేసి శిలాఫలకాలు ఏర్పాటు చేశామని అప్పటి నిధుల నుండి చేపడుతున్న పనులకు నేనే తీసుకు వచ్చానని ఇప్పటి ఎమ్మెల్యే ప్రచారం చేసుకోవడం సబబు కాదని అన్నారు.
మా హయాంలో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఇప్పటి ఎమ్మెల్యే నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోయినా మేము చేసిన పనులను కొనసాగించినా సరిపోతుందని, నగరంలో కంటేశ్వర్ నుండి బొర్గం వరకు ఏర్పాటు చేసిన సెంటర్ మీడియాన్ లలోని కనీసం 20% కూడా స్ట్రీట్ లైట్స్ పనిచేయటం లేదని, నాటిన మొక్కలకు నీరు పోసే నాధుడు లేడని, కాలనీలలోని స్ట్రీట్ లైట్స్ పని చేయటం లేదని విమర్శించారు.
ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ (బొడ్డెమ్మ చెరువు) వద్ద ఊడ్చే నాధుడు లేడని, లైట్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని అన్నారు. అభివృద్ధిలో పోటీపడి మా కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేయాలని హితవు పలికారు. మా హయాంలో వచ్చిన నిధులను తానే తీసుకువచ్చినట్లు చేసుకుంటున్న ప్రచారాన్ని ఖండించారు. (మేము, మా హయాంలో తెచ్చిన 100 కోట్ల నిధుల G.O కాపీ, మేము తీసిన కృతజ్ఞత ర్యాలీ ఫోటోలు కూడా జత చేస్తున్నాము)
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదాన్న గారి విఠల్ రావ్, ఎమ్మెల్సీ విజి గౌడ్, మాజీ మేయర్ నీతూ కిరణ్ శేఖర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సీనియర్ నాయకులు సుజిత్ ఠాకూర్ సత్య ప్రకాష్, వి శాలిని రెడ్డి, సుమనా రెడ్డి, నవీద్ ఇక్బాల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.