ఖలీల్వాడి, నవంబర్ 3 : చేనేతల మగ్గాలు సీఎం కేసీఆర్ కృషితో నేడు పరుగులు పెడుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని జనార్దన్ గార్డెన్లో శుక్రవారం రాత్రి పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. గతంలో చేనేతలు పనిలేక ఆత్మహత్యలకు పాల్పడేవారని, బతుకమ్మ చీరల తయారీతో వారికి చేతి నిండా పని ఉండేలా చేసిన మహానీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. పద్మశాలీ కులస్తులకు సంబంధించిన అభివృద్ధి పనులకు రూ. 8 కోట్లు, భక్త మార్కండేయ ఆలయ పునర్నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేశామని, కోటి రూపాయలతో పద్మశాలీ హాస్టల్, రూ. కోటీ 50 లక్షలతో పద్మశాలీ కల్యాణ మండపం, రూ.5 లక్షలతో పద్మశాలీ ఉద్యోగుల సంక్షేమ భవన నిర్మాణం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీ నగర గుజ్జెటి వెంకటనర్సయ్య, ఎనుగందుల మురళి, సిర్ప రాజు, సిరిగాదా ధర్మపురి, ఎస్ఆర్.సత్యపాల్, పూల్గం హన్మాండ్లు, డీకొండ యాదగిరి, బిల్లా మహేష్, చింత మహేశ్, రాపెల్లి గురుచరణం, కస్తూరి గంగరాజు, శివలింగం, బింగి మోహన్ పాల్గొన్నారు.
కుర్మకులస్తుల ఆత్మ గౌరవానికి భరోసా కల్పించేందుకు నగరంలోని ప్రతి సంఘానికి కమ్యూనిటీ హాళ్లకు నిధులు మంజూరు చేశామని బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని కేసీఆర్ కాలనీలో కుర్మ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించగా.. బిగాల హాజరై మాట్లాడారు. కుర్మ కులస్తులు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. పదేండ్లలో నగరాన్ని ఎంతోఅభివృద్ధి చేశామని చెప్పారు. జిల్లాకేంద్రంలోని అన్ని గల్లీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని అన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద డివైడర్ల నిర్మాణం, మొక్కల పెంపకం, సెంట్రల్లైటింగ్ ఏర్పాటు చేయించామన్నారు. రూ.25 కోట్లతో ఆర్యూబీ నిర్మించామని, ఐటీ హబ్, న్యాక్ సెంటర్ నిర్మించామని అన్నారు. వీటితోపాటు మినీ ట్యాంక్బండ్, ఆధునిక హంగులతో వైకుంఠధామాలను నిర్మించామని వివరించారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, కుర్మ సంఘం నగర అధ్యక్షుడు గోపరి లక్ష్మణ్, కార్పొరేటర్ బైకాన్ సుధ, మాజీ కార్పోరేటర్ గోపరి సుగుణ, ఆర్ఎల్.నర్సింహ, బైకాన్ మధు, ప్యాట సంతోష్, చేగంటి గంగాధర్, అరుణ్ పాల్గొన్నారు. నగరంలోని 53వ డివిజన్లో ఉన్న శాంతినగర్లో మైనార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించగా.. బిగాల హాజరై మాట్లాడారు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు.