భీమ్గల్, జూన్ 25 : మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మంత్రి కృషితో కోట్లాది రూపాయల నిధులు మంజూరు కావడంతో పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది.
గతంలో భీమ్గల్లో కనీస వసతులు, మరుగుదొడ్లు,రోడ్లు, నీటి సౌకర్యం, మురుగు కాలువలు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మున్సిపాలిటీగా మారడంతో ప్రభుత్వం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మౌలిక వసతుల కల్పనకు రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు తదితర పనులను చేపట్టింది. ఈ పనులన్నీ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. పట్టణంలో ఉన్న డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మారుస్తూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
మనిషి చివరి మజిలీకి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రూ. రెండు కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో అన్ని మతాల వారికి సకల సౌకర్యాలతో ఆరు వైకుంఠధామాలను నిర్మించారు. పట్టణంలో సేకరించిన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.50లక్షల నిధులతో ఎఫ్ఎస్టీపీ ఏర్పాటు చేశారు. వివిధ పనుల మీద పట్టణానికి వచ్చే వారి కోసం రూ.30 లక్షల నిధులతో మూడు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు.
మంత్రి వేముల ప్రభుత్వం నుంచి మరో ఆరుకోట్ల నిధులను మంజూరు చేయించి పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నారు. పాత పోలీసు స్టేషన్లో రూ.75 లక్షలతో అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు ఇవ్వాలన్న సంకల్పంతో రూ.5.50కోట్లతో ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని 12 వార్డుల్లో 2000 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహరం కార్యక్రమాలతో పట్టణం హరిత వనంగా మారింది. హరితహారంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఎనిమిది ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు. పన్నెండు వార్టుల్లో 200 చొప్పున మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. సెంట్రల్ నర్సరీ ఏర్పాటుతో పట్టణంలో కావాల్సిన మొక్కలను అక్కడి నుంచి తీసుకొచ్చి వార్డుల్లో నాటుతున్నారు. పట్టణంలోని రాతం చెరువుపై రూ.5.90 లక్షలతో చేపట్టిన మినీ ట్యాంకు బండ్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు.
పట్టణంలో రూ.3కోట్ల నిధులతో సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం కొనసాగుతున్నది. దీంతో ప్రజలకు కావాల్సిన కూరగాయలు, మాంసం ఒకేచోట లభించనున్నది. చెత్త సేకరణకు గతంలో కేవలం ఒక ట్రాక్టర్ మాత్రమే ఉండేది. పట్టణ ప్రగతిలో భాగంగా ఇప్పుడు ఆటోలు, ట్రాక్టర్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. దీంతో చెత్త సేకరణ సులభమైంది. పట్టణం శుభ్రంగా మారింది.
పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత భీమ్గల్ చాలా మారింది. మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. సెంట్రల్ లైటింగ్, ఫోర్లేన్ రోడ్డు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి పురపాలికగా మారిన నాలుగు ఏండ్లలోనే జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రి వేముల సహకారం మరువలేనిది.
-కన్నె ప్రేమలతా సురేందర్, మున్సిపల్ చైర్పర్సన్, భీమ్గల్