భీమ్గల్, నవంబర్ 2: దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. పేద విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సర్కారు చేయూతకు విద్యార్థుల కృషి తోడవుతున్నది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇటు చదువులో, అటు ఆటల్లో, మరోవైపు జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాల్లో ప్రతిభచాటుతున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండడంతో పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. దీంతో ఏటా సర్కారు పాఠశాల విద్యార్థులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పల్లికొండ ప్రభుత్వ పాఠశాల.
ప్రభుత్వ పాఠశాల అంటే చిన్నచూపు ఉండే పరిస్థితి నుంచి నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారి, అందరి చూపును తన వైపు తిప్పుకున్నదీ పాఠశాల. ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు తమ పిల్లలని పంపిస్తూ లక్షల రూపాయలను ఫీజుల రూపంలో కడుతూ ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేయడంతోపాటు వాటిలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నది. పాఠశాలల అభివృద్ధికి పాటు పడుతుండడంతో అందరి చూపు సర్కారు బడులవైపు మళ్లింది. అందుకు ఉదాహరణే భీమ్గల్ మండలంలోని పల్లికొండ ప్రభుత్వ పాఠశాల. గతంలో ఈ పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోయింది. కానీ, ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతున్నది. పాఠశాలలో కేవలం పాఠాలే కాకుండా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలు వెలుగులోకి తెస్తున్నారు. ఫిజికల్ సైన్స్, సైన్స్ ఫెయిర్లతో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూనే మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు నూతన ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
సైన్స్ఫెయిర్..
2017-18వరంగల్లో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో రెండోస్థానం. హైదరాబాద్లో జరిగిన సౌత్ ఇండియా స్థాయి సైన్స్ ఫెయిర్లో రెండోస్థానం సాధించారు.
2018-19లో ఆదిలాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్లో మొదటి స్థానంలో నిలిచారు.
2019లో వరంగల్లో జరిగిన ఇన్స్పైర్ అవార్డు కార్యక్రమంలో రాష్ట్రస్థాయి మొదటి బహుమతి సాధించారు.
టాలెంట్ టెస్టులో…
2017లో మొదటగా పాల్గొన్న ఫిజికల్ సైన్స్ టా లెంట్ టెస్ట్లో బాలహరిణి, సౌమిక జిల్లాస్థాయిలో వరుసగా మొదటి, రెండోస్థానం, రాష్ట్రస్థాయి ఐదో స్థానం సాధించి అబ్బురపరచారు. 2020లో జిల్లా స్థాయిలో మొదటి, రెండో, రాష్ట్రస్థాయిలో వరుసగా రెండు, మూడో స్థానాలను కైవసం చేసుకొని పాఠశాలకు చెందిన సాయిప్రసన్న, స్నేహ ప్రతిభచాటారు.
సైన్స్ సెమినార్..
2018, 19, 21, 22లలో జిల్లాస్థాయి సైన్స్ సెమినార్లో పల్లికొండ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్లో విద్యార్థులు బాలహరిణి, సాయి ప్రసన్న, అంజనశ్రీ, రుత్విక నాల్గో స్థానంలో నిలిచారు. రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్లో అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా.. ఉత్తమ ప్రతిభ కనబర్చి మూడోస్థానం సాధించిన విద్యార్థి సాయిప్రసన్న పల్లికొండ పాఠశాలకు గుర్తింపు తెచ్చింది.
ఇస్రో స్లోగన్ అవార్డు..
ఇస్రో 2021 సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో ఇస్రో స్లోగన్ కాంపిటేషన్ నిర్వహించగా అందులోనూ పల్లికొండ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్రస్థాయిలో వరుసగా మొదటి, రెండో స్థానాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. 2018 అగస్త్య సైన్స్ఫెయిర్లో రాష్ట్రస్థాయిలో మూడో బహుమతి, 2020 సంవత్సరంలో మొదటి బహుమతి సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
విద్యార్థుల ప్రతిభకు కొదువ లేదు..
గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు కొదువ లేదు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యనందించడంతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాం. దానికి నిదర్శనమే మా పాఠశాల.
– హరినాథ్, హెచ్ఎం, పల్లికొండ పాఠశాల
సర్కారు ప్రోత్సాహంతో..
విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో సైన్స్లో రాణిస్తున్నారు. పాఠశాలలో సైన్స్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. దీంతో సైన్స్ ఫెయిర్కు కావాల్సిన వస్తువుల సేకరణ సులభతరం అయ్యింది. సర్కారు ప్రోత్సాహంతో విద్యార్థుల ఆవిష్కరణలు అందరికీ తెలుస్తున్నాయి.
– గంగామోహన్, ఫిజికల్ సైన్స్
ఉపాధ్యాయుడు, పల్లికొండ పాఠశాల