లింగంపేట, నవంబర్ 23 : ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న గ్రామం.. ప్రస్తుతం కళాకారులకు పుట్టినిల్లుగా మారింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన పలువురు వివిధ కళల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. భవానీపేట గ్రామంలో సుమారు 600 పైగా కుటుంబాలు ఉన్నాయి. చిన్న గ్రామం అయినప్పటికీ అన్ని రంగాలకు సంబంధించి వంద మందికి పైగా కళాకారులు ఉన్నారు. వీరు ఆయా రంగాల్లో తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. గ్రామంలో నిర్వహించే వివిధ ఉత్సవాలకు వీరు ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
గ్రామానికి చెందిన యువకులు జానపద గేయాలు, పల్లె సుద్దులు, భజన కార్యక్రమాలు, వీధి నాటకాలు, కోలాటం తదితర కళల్లో రాణిస్తున్నారు. గ్రామాల్లో అవినీతి, అంటరాని తనం, స్త్రీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, అణగారిన వారిపై దౌర్జన్యాలు తదితర అంశాలపై ఆటపాటల రూపంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. యువ కళాకారుల ఉత్సాహాన్ని గమనించిన ఆనాటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీహరి, లక్ష్మీనారాయణ వివిధ కళలపై వీరికి అవగాహన కల్పించారు. యువకులు ముందుగా పాఠశాలలో నాటికలు ప్రదర్శించారు.
అనంతరం గ్రామంలో వీధినాటకాలు ప్రదర్శించడం, గేయాలు ఆలపించడంతో పాటు భజన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. కళలతో పాటు గేయాలు ఆలపించడంలో పట్టు సాధించిన కళాకారులు.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శనలు నిర్వహించారు. అక్షర కిరణం, ఎయిడ్స్ నివారణ, శిశు సంక్షేమం, బాల్య వివాహాలు, వైద్యశాఖ, ఇందిరాక్రాంతి పథకం, తెలంగాణ ధూందాం, వరకట్న దురాచారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై కళా ప్రదర్శనలు ఇచ్చారు. వీటితో పాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పంట మార్పిడి విధానం, పంటల సాగుకు ముందు భూసార పరీక్షల ఆవశ్యకత, భూగర్భ జలాల పెంపు, గ్రామజ్యోతి, గోదావరి పుష్కరాలపై ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్య సమయంలో ఉర్రూతలూగించే జానపద గేయాలు ఆలపిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమంపై కళాప్రదర్శనలు నిర్వహించి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మూడేండ్ల క్రితం దేశ స్థాయిలో సంస్కారభారతి వారు నిర్వహించిన కార్యక్రమంలో భవానీపేట కళాకారులు నాలుగో స్థానంలో నిలిచారు. సమాచార శాఖ అధికారులు జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలిచారు. కళాకారులుగా ఉత్తమ ప్రదర్శనలు నిర్వహించిన వీరు.. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాకారులకు గుర్తింపు లభించింది. కళాకారులను ఆదుకునేందుకు చేయూతనిస్తున్నది. గత ప్రభుత్వాలు కళాకారుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించాయి. ప్రభుత్వ పథకాలపై ప్రదర్శన ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంలో వివిధ ప్రదర్శనలు ఇస్తున్నాం.
– ఆకుల మహేందర్, భవానీపేట
రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు గుర్తింపునిస్తున్నది. ఉద్యమ సమయంలో స్వచ్ఛందంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ఉద్యమంపై జానపద పాటలు పాడి ప్రజల్లో చైతన్య నింపాం. కళాకారులకు మరింత ప్రోత్సాహం అందించాలి. పేద కళాకారులను ఆదుకోవాలి. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహిస్తా.
–శంకర్గౌడ్, భవానీపేట