నిజామాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయబోయే వారి జాబితాను కేసీఆర్ ప్రకటించడం అన్నది ప్రతిపక్షాలపై పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ లాంటిదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అభివర్ణించారు. దేశంలో కేసీఆర్ లాంటి నాయకుడు మరెక్కడా లేరని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎంతటి ఘనమైనదో చెప్పేందుకు 119స్థానాలకు 115మందితో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తెలిసిపోయిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు కనీసం పోటీచేసేందుకు అభ్యర్థులు లేని దుస్థితి ఏర్పడిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కనీసం పీసీసీ అధ్యక్షుడి స్థానాన్ని కూడా ఖరారు చేసుకోలేని దుస్థితి హస్తం పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ అభ్యర్థులుగా ప్రకటించాలంటూ రేవంత్ రెడ్డి గతంలో చేసిన మాటలను పోచారం శ్రీనివాస రెడ్డి గుర్తుచేశారు. 115మంది జాబితా విడుదలైన తర్వాత పీసీసీ చీఫ్ నోటికి తాళం పడిందన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోన్న వేళ, బీఆర్ఎస్ ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్న వేళ “నమస్తే తెలంగాణ”తో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పలు వివరాల ను వెల్లడించారు.
నమస్తే తెలంగాణ : ఒకేసారి 115మంది ఎమ్మెల్యే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంపై మీరేమంటారు?
పోచారం: ఇలాంటి ధైర్యమైన నిర్ణయాలు కేవలం కేసీఆర్ ఒక్కరితోనే సాధ్యం అవుతుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో అనేకం ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయాలను వెల్లడించడం మరెవ్వరికీ సాధ్యం కాదు. సిట్టింగ్లకు టికెట్లు కేటాయించి మొదటి జాబితాలోనే దాదాపుగా అందరి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం అన్నది గొప్ప విషయం. బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికీ ప్రజల పార్టీ. పేద కుటుంబాలకు బాసటగా నిలిచే పార్టీ. తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన పార్టీ. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్న పార్టీ. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కే మద్దతుగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అదే తేటతెల్లం అవుతుంది కూడా.
తెచ్చుకున్న తెలంగాణను చక్కబెట్టేందుకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ రథసారథిగా ఉండడం నాలుగున్నర కోట్ల ప్రజల అదృష్టం. సాగు రంగాన్ని, వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతిలో రాష్ర్టాన్ని ముందంజలో నిలిపారు. నూతన రాష్ట్రంగా పురుడు పోసుకున్న తెలంగాణను ప్రణాళికాబద్ధంగా ఎవరూ ఊహించని విధంగా యావత్ దేశానికే తలమానికంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ కృషి అమోఘం. ఇలాంటి చారిత్రాత్మకమైన సందర్భంలో కేసీఆర్తో ఉండడం నా అదృష్టం. మొదటి ప్రభుత్వంలో
ప్రతిపక్షాలు అభ్యర్థుల వేటలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో కాలం చెల్లింది. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలే అభ్యర్థులను ముందస్తుగానే డిక్లేర్ చేసుకొని పోటీకి సై అంటూ ముందుకువస్తాయి. అందుకు భిన్నంగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 115 మందితో జాబితాను విడుదల చేయడంతో కాంగ్రెస్, బీజేపీలు కంగుతినే పరిస్థితి ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ప్రజల మద్దతును దక్కించుకున్న బీఆర్ఎస్ మినహాయిస్తే కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదు. అభ్యర్థుల వేటలో విలవిల్లాడి కేవలం బీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై ఆధారపడి ఈడ్చుకొచ్చే పరిస్థితి వారిది. ప్రజలకు మేలు చేస్తే వారి మద్దతు, ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది. కేసీఆర్ పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీకి అది సాధ్యమైందని చెప్పాలి.
తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ను ప్రజలంతా గుండెల్లో పెట్టుకొని ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ను దీవిస్తున్నారు. 2014, 2018 మాదిరిగానే 2023లోనూ చరిత్ర సృష్టించడం ఖాయం. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి వందకుపైగా సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారు. ఇందుకు ఈ తొమ్మిదేండ్ల కాలంలో కేసీఆర్ పరిపాలనలో సాధించిన ప్రగతి, అభివృద్ధిని ప్రజలంతా గుర్తిస్తున్నారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం తథ్యం. 2014లో 63అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 2018అసెంబ్లీ ఎన్నికల్లో 83 సీట్లు వరించాయి. 2023లో నా అంచనా మేరకు గతంతో పోలిస్తే మరో 20 సీట్లు పెరిగి 103 వరకు వస్తాయని భావిస్తున్నాను.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను 2012లో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరాను. ఆనాడు ఉద్యమ కాలంలో పోటీ చేసి ఘనమైన విజయాన్ని సాధించాను. స్వరాష్ట్రంలో వచ్చిన 2014 తొలి ఎన్నికల్లోనూ బాన్సువాడ నుంచి ప్రజల మద్దతుతో జయకేతనం ఎగుర వేశాను. 2018లోనూ ప్రజలందరూ ఆశీర్వదించడంతో గెలిచాను. 2023లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్లి అపురూపమైన విజయాన్ని సాధిస్తాను. వరుసగా నాలుగోసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండడం చాలా ఆనందంగా ఉన్నది.
బాన్సువాడ ప్రజలు నాకు దైవసమానులు. వారి ఆశీర్వాదంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు ప్రజల మద్దతు నాకు పుష్కలంగా దొరుకుతుండడానికి చేసే పనితీరే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాల హయాంలో పని చేసినప్పుడు వింత అనుభవాలు ఎదురయ్యేవి. సాగుకు నిజాంసాగర్ నీళ్లను విడుదల చేయించుకోవాలంటే సీఎంకు వినతులు పెట్టినా స్పందన ఉండేది కాదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు కొండంత భరోసా లభించినట్లు అయ్యింది. నిజాంసాగర్ నీళ్లను పుష్కలంగా వాడుకునే సౌలభ్యాన్ని కేసీఆర్ కల్పించారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహకారం మరువలేనిది. మొన్ననే తీసిన లెక్కల ప్రకారం ఈ తొమ్మిదేండ్లలో రూ.11వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి జరిగింది.
పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మూడు నెలల కింద కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ తరహాలో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని రైతులంతా తెలంగాణ తరహా రైతుబంధు పథకం కావాలని, కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. కర్ణాటకలో ఉచిత బస్సు సౌకర్యం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంటూ గొప్పలు చెప్పి చేతులెత్తేశారు. అక్కడి ప్రజలకు ఉచిత బియ్యం హామీని నిలబెట్టుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. చేతకాని అసత్యపూరిత హామీలతో ప్రజలను వంచించే కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణలో ప్రజలెవ్వరూ నమ్మరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీకి లీడర్లు లేరు. కాంగ్రెస్కు కేడర్ కరువు. వీటితో బీఆర్ఎస్కు పోటీయే ఉండదు.