కామారెడ్డి/ ఖలీల్వాడి, మార్చి 16: ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కవిత అరెస్టుకు నిరసనగా పార్టీ శ్రేణులు శనివారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు నిరసనలతో హోరెత్తించాయి. జిల్లా కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిజామాబాద్లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కామారెడ్డిలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బిచ్కుందలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసి, ఆ పార్టీలకు చెందిన నాయకులపై కక్ష సాధిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను అణగదొక్కడానికి కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.