నిజామాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. బీజేపీతో పాటు మోదీకి ‘ఈడీ’గం చేస్తున్న దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. లోక్సభ ఎన్నికల ముందర కావాలనే కవితను అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే కుట్రలకు తెర లేపారని ధ్వజమెత్తారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే, వేల్పూర్ సహా వివిధ ప్రాంతాల్లోనూ పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. సోదాల పేరిట వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లిన వైనంపై మండిపడ్డారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా రాత్రివేళ హడావుడిగా ఢిల్లీకి తరలించిన తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేని దుష్ట శక్తులు దిగజారి ప్రవర్తిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ను నేరుగా ఢీకొట్టే ధైర్యం లేక కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పాయి. మొదటి నుంచి తెలంగాణపైన, కేసీఆర్ కుటుంబంపైనా కేంద్రంలోని బీజేపీ కక్షగట్టింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు నిధులు ఇవ్వకుండా సతాయించింది. తెలంగాణ అభివృద్ధికి మచ్చుకైనా సహకరించకుండా సహాయ నిరాకరణ చేసింది. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని కుంభకోణంగా మలిచి.. అందులోకి ఎమ్మెల్సీ కవితను లాగింది.
మొదట్లో కవితను సాక్షిగానే విచారణకు రావాలని దర్యాప్తు సంస్థ పిలిచింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కవిత ఈడీ ఆదేశాలను పాటించి విచారణకు పూర్తిగా సహకరించారు కూడా. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. ఏ దుష్ట శక్తుల నుంచి వచ్చిన ఒత్తిళ్లో కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను నిందితురాలని పేర్కొంటూ అరెస్టు చేసింది. పైగా కవిత కేసు విషయంలో ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు (అరెస్టు లాంటివి) తీసుకోబోమని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన ఈడీ.. ఉన్నట్టుండి మాట తప్పింది.
ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా, తెల్లారితే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా ఈడీ వ్యవహరించిన తీరు పక్కా రాజకీయ కోణంలోనే సాగినట్లు స్పష్టమవుతున్నది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కేంద్రానికి అధికారం చలాయించడం కుదరదు. దీంతో తమ రాజకీయ కక్షసాధింపు చర్యలకు విఘాతం కలుగుతుందన్న అభిప్రాయంతోనే కేంద్రం ఇలా అక్రమంగా అరెస్టు చేయించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కవిత అరెస్టుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. కవితను అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను టీవీల్లో చూసిన అభిమానులు, మహిళలు ఆవేదనకు గురయ్యారు. నిజామాబాద్ నగరంతో పాటు వేల్పూర్ తదితర ప్రాంతాల్లో రోడ్డెక్కారు. బీజేపీ, మోదీ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలను దహనం చేశారు.
వాస్తవానికి ఢిల్లీ మద్యం పాలసీ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ.. రెండేళ్లుగా టీవీ సీరియల్లా విచారణను సాగదీస్తున్నది. ఇందులో కవితను బాధ్యురాలిని చేసిన కాలం గడిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. తీరా ఎన్నికల ముంగిట హడావుడిగా అరెస్టు చేసింది. పైగా ఈ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదాకాలిస్తూ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. మహిళలను విచారణ పేరిట కార్యాలయాలకు పిలవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్నది.
గతంలో విచారణ సందర్భంగా కవితను అరెస్టు చేయబోమని ఈడీ కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలుచేసింది. కవిత వేసిన పిటిషన్పై శుక్రవారం కూడా అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్లో వాలిపోయిన ఈడీ అధికారుల బృందం కవిత ఇంట్లో దిగింది. సోదాల పేరిట వచ్చిన అధికారులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే చకచకా సోదాలు పూర్తి చేయడం, అరెస్టు చేయడం, ఢిల్లీకి కవితను తరలించేందుకు ముందస్తుగానే ఫ్లైట్ టికెట్లను బుక్ చేయడం చూస్తుంటే ఇదంతా ప్లాన్లో భాగంగానే చేసినట్లు అర్థమవుతున్నది. ఎన్నికల ముందర బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బ కొట్టడమే ఏకైక లక్ష్యంగా కవితను అరెస్టు చేశారన్న భావన వ్యక్తమవుతున్నది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు వార్త తెలియగానే ఆమె అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కవితకు మద్దతుగా బంజారాహిల్స్లోని ఆమె ఇంటికి చేరుకున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు కవిత ఇంటికి వెళ్లి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఈడీ వ్యవహార శైలిపై ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాంగా కేసీఆర్ను, బీఆర్ఎస్ను దెబ్బ తీయడానికే మోదీ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని, ఇదో విఫలయత్నంగానే మిగిలిపోతుందని వేముల తెలిపారు. ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడబోమన్నా రు. చట్టపరంగా న్యాయస్థానాల్లో పోరాడుతాం. ప్రజాక్షేత్రంలో రాజకీయంగా తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాజ్యాంగం అనేక రక్షణలను కల్పించింది. పార్టీలకతీతంగా వ్యవహరించడంతోపాటు స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాల్సిన బాధ్యతను కట్టబెట్టింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను గుప్పిట పట్టుకుని జేబు సంస్థలుగా మార్చేసింది. అందులో భాగంగానే తరచూ తమకు గిట్టని వారిపై దాడులకు ఉసిగొల్పారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతుందని మొదటి నుంచి ప్రచారం చేయడం చూస్తుంటే ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని స్పష్టమవుతున్నది.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కె.లక్ష్మణ్ చెప్పింది చెప్పినట్లే దర్యాప్తు సంస్థలు ప్రవర్తించడం వెనుకున్న మర్మం ఏమిటో ఇప్పుడు బోధ పడింది. ఈడీ, సీబీఐ దర్యాప్తు బీజేపీ పెద్దల డైరెక్షన్ ప్రకారమే జరుగుతున్నదని ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థల కదలికలు, పనితీరు అంతా కూడా బీజేపీ కనుసన్నల్లోనే కొనసాగుతుండటంతో వీటి లక్ష్యం బీజేపీ రాజకీయ వ్యూహాలను అమలు చేయడమేనని తేలిపోయింది.
వేల్పూర్, మార్చి 15 : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కవితను అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రేగుళ్ల రాములు, దయాకర్, సుంకరి రాము, పిట్ల సత్యం, బబ్బురు ప్రతాప్, మొండి మహేశ్, నోముల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
-మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ, మార్చి 15 : రాజకీయ కక్ష సాధింపుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కవితను అక్రమంగా అరెస్టు చేయించిందని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీఆర్ఎస్ను నష్టపరుద్దామని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ కవితకు అండగా ఉంటామన్నారు. న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో శనివారం నిరసన కార్యక్ర మాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డి, మార్చి 15 : పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎన్నికల సమయం లో ప్రత్యర్థి పార్టీలను భయపెట్టినంత మాత్రాన ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
లిక్కర్ కేసులో ఎన్నో నెలలుగా విచారణ పేరిట జాప్యం చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు హఠాత్తుగా హైదరాబాద్కు రావడం, వెంటనే కవితను అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని అన్నారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని, బీజేపీకి ఓటమి ఖాయమన్నారు.