బాన్సువాడ రూరల్, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన ఇంగ్లిష్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామం లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాల్లో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి పాల్గొన్నారు. రూ. 24లక్షలతో చేపట్టనున్న వీరహనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
రూ.20లక్షల చొప్పున రూ. 40లక్షలతో నిర్మించిన రెండు ముదిరాజ్ సంఘాల కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. రూ.10లక్షలతో నిర్మించిన బోయి సంఘం ప్రహరీ, రూ.17లక్షలతో నిర్మించిన మైనా ర్టీ శ్మశాన వాటిక ప్రహరీ, రూ. 17లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ ప్రహరీతోపాటు రూ. 16లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మన ఊరు-మనబడిలో భాగంగా రూ. 11లక్షలతో ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను తానే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో 351 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు.
పేదల సొంతింటి కల సాకారం
గూడు లేని ప్రతి నిరుపేదకు గూడు కల్పించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల పథకం పేదల సొంతింటి కలను సాకారం చేసిందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికీ డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. సొంత జాగ కలిగి ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి త్వరలో రూ.3లక్షలు మంజూ రు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు వ్యవసా యం దండుగ అని పేర్కొనగా.. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేసిందన్నారు. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు పంటలకు పుష్కలం గా సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. కేంద్రం సహకరించకున్నా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరించిందన్నారు.
ఇది ప్రజా సంక్షే మ ప్రభుత్వమని ప్రజలు ఆదరించాలని కోరారు. కల్లిబొల్లి మాటలు చెప్పి గ్రామాల్లో చిచ్చు పెట్టే నాయకుల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామానికి వచ్చిన స్పీకర్కు బోయి కులస్తులు వలలతో నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ పద్మ, గ్రామ సర్పంచ్ మాలెపు నారాయణరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, ఎంఈవో నాగేశ్వర్రావు, ఇబ్రహీంపేట్ తండా సర్పంచ్ ప్రేమ్సింగ్, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, దేవారం సాయిరెడ్డి, నారాయణరెడ్డి, ప్రవీణ్రెడ్డి, సాయిలు యాదవ్, బండి పండరి, రమేశ్, విఠల్, కామేశ్వర్, వసీయోద్దీన్, శ్రీనివాస్రెడ్డి, రాజిరెడ్డి, రంజిత్రెడ్డి, అశోక్, సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ గారు.. నేను చదివింది ఈ తరగతి గదిలోనే..
‘కలెక్టర్ గారు నేను చిన్నప్పుడు విద్యా, బుద్ధులు నేర్చుకుంది ఈ తరగతి గదిలోనే.. నా గురువు మోజేశ్ సారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లి నేడు ఈ స్థాయిలో ఉన్నా..’ అంటూ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ..కలెక్టర్ జితేశ్ వీ పాటిల్కు చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన.. తన తరగతి గదిని చూస్తూ మురిసి పోయారు. 1954 నుంచి 1959 వరకు రెండు నుంచి ఐదో తరగతి వరకు ఈ తరగతి గదిలోనే చదువుకున్నాని కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను తాను చదువుకున్న తరగతి గదిలోకి పిలిపించుకున్నారు. మీరంతా నా క్లాస్మెంట్లు అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సరదాగా ముచ్చటించారు. తాను చదవుకున్న తరగతి గదిని గ్రంథాలయంగా మార్చడంపై స్పీకర్ సంతోషం వ్యక్తంచేశారు.