ఎల్లారెడ్డి రూరల్, జూన్ 27: మరో రెండు వారాల్లో వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల సమయంలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు పుట్టుకొసున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో రంది లేకుండా సాగు కొనసాగుతున్నది. ఉచిత విద్యుత్తోపాటు సాగు నీరు కూడా సమృద్ధిగా అందుతుండడంతో వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో నకిలీ, నాసిరకం విత్తనాలను అంటగట్టే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వ నిబంధనలు, గుర్తింపు వివరాలు సరి చూసుకున్న తర్వాతే విత్తనాలను కొనుగోలు చేయాలని ఎల్లారెడ్డి ఏడీఏ ఎన్ఎన్వీ రత్న సూచిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు….
వ్యవసాయశాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలి. రసీదుపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. గడువు దాటిన విత్తనాలు, చిరిగిన ప్యాకె ట్లు, తెరిచిన డబ్బాల నుంచి ఇచ్చే ప్యాకెట్లను కొనుగోలు చేయొద్దు. రసీదుపై విక్రయదారుని పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేల్స్ ట్యాక్స్ నంబర్లు, విక్రయదారుని గ్రామం, పేరు, సంతకం, తేదీలు, రకాలు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు నమోదై ఉండాలి. కొనుగోలు చేసిన సరుకు డీలర్ వద్ద తూకం వేయించాలి. మొలకెత్తే, పూతదశల్లో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించాలి. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో పొందిన రసీదును పంటకాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగు మందులనే కొనుగోలు చేయాలి. అవసరానికి మించి కొనుగోలు చేసిన మందులను నిల్వ ఉంచి వాడొద్దు. పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో పురుగుమందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం రంగు, స్వల్వ విషపూరితమైతే ఆకుపచ్చరంగులు ఉంటాయి. ఒక పంటకు వాడిన పురుగు మందును మరో పంటకు వాడే విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.
కల్తీలను గుర్తించడం ఇలా…..
యూరియా, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ వంటి ఎరువులు గుళికల రూపంలో ఉంటాయి. ఎరువులు ఇసుక రేణువుల రూపంలో ఉంటాయి. పొటాష్, సూపర్ పాస్ఫేట్ పొడి రూపంలో ఉంటాయి. 5మిల్లీలీటర్ల నీటిలో చెంచా ఎరువును వేసి బాగా కలపాలి. ఇది స్వచ్ఛమైన ద్రావణంలా మారితే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమ్మోనియం క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిని వినియోగించుకోవాలి. యూరియా ఒక చెంచా, ఐదు మిల్లీ లీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలపాలి. అడుగున మట్టి చేరితే అది కల్తీగా గుర్తించవచ్చు. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇదే పద్ధతిలో పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చినా కల్తీ ఎరువుగానే గుర్తించాలి.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.
దిగుబడి బాగా వస్తుందని, ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి మార్కెట్లో తక్కువ ధరకు విత్తనాలు దొరుకుతున్నాయని వాటిని కొనుగోలు చేయవద్దు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. వివిధ కంపెనీల ఆకర్షణీయమైన ప్రకటలకు మోసపోవద్దు. ప్రైవేట్ కంపెనీలు రైతులకు నకీలీ విత్తనాలు అంటగట్టే ప్రమాదముందనే విషయాలను గ్రహించాలి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ద్వారా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నందున ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తు న్నాం. నకిలీ విత్తనాలు, ఎరువులు ఎక్కడైనా అమ్మిన ట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయాధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలి.
– ఎన్ఎన్వి రత్న, ఎల్లారెడ్డి ఏడీఏ