బాన్సువాడ, జనవరి 9: బీఎస్ఎన్ఎల్లో అతనో సూపర్వైజర్. పని చేసే సంస్థకే కన్నం పెట్టాడు. బ్యాటరీలను మాయం చేసిన వ్యక్తే ఉల్టా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన సూత్రధారి సూపర్వైజర్ సహా ఆరుగురిని కటకటాల్లోకి పంపించారు. కేసు వివరాలను బాన్సువాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి మంగళవారం విలేకరులకు వెల్లడించారు. రాజన్నసిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణరావు పేట గ్రామానికి చెందిన అరుణ్కుమార్.. కామారెడ్డి జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ టవర్ల బ్యాటరీలకు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వృత్తి రీత్యా కామారెడ్డిలోని అశోక్నగర్లో నివాసం ఉంటున్నాడు. అతనితో పాటు టవర్ల వద్ద గడ్డి కత్తిరించే కూలీలైన ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన బోడమీది రాజు, గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన గొలుసు లింగం, మ్యాతరి సాయిలు, గైని మైసయ్యలు ముఠాగా ఏర్పడ్డారు. సంవత్సరం క్రితం నుంచి జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ టవర్ల వద్ద ఉండే బ్యాటరీలను దొంగిలించడం ప్రారంభించారు. ఈ నెల 2వ తేదీన ఐదుగురూ కలిసి తాడ్కోల్ శివారులో ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద బ్యాటరీలను చోరీ చేస్తుండగా, అదే సమయంలో టవర్ టెక్నీషియన్ రాగా తప్పించుకొని పారిపోయారు.
ఈ నెల 8న ఉదయం 8.30 గంటలకు బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, కారులో వస్తున్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు వెంబడించి పట్టుకుని ఆరా తీయగా బ్యాటరీల చోరీ విషయం బయటపడింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 9 గ్రామాల్లోని టవర్ల వద్ద 264 బ్యాటరీలను మాయం చేసి, వాటిని కామారెడ్డిలోని ఖలీల్ పాత ఇనుప సామగ్రి దుకాణంలో విక్రయించినట్లు గుర్తించారు. ఖలీల్ను అదుపులోకి తీసుకొని విచారించగా, హైదరాబాద్లో కొన్ని బ్యాటరీలను విక్రయించినట్లు వెల్లడించాడు. మిగిలిన 72 బ్యాటరీలను, అలాగే బ్యాటరీల విక్రయంతో వచ్చిన రూ.1.50 లక్షల నగదును, దొంగతనాలకు వాడిన టాటాఏస్ ఆటో, కారును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులతోపాటు బ్యాటరీలను కొనుగోలు చేసిన ఖలీల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై చంద్రయ్య, జగన్నాథంతోపాటు పోలీసు సిబ్బందిని అభినందించారు.