‘బస్తీ దవాఖాన’ ప్రారంభానికి చర్యలు
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
శక్కర్నగర్, జూన్ 19: బోధన్ పట్టణం శక్కర్నగర్ ప్రాంతంతోపాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజల ముంగిట్లోకి వైద్యసేవలు రానున్నాయి. గతంలో ఫ్యాక్టరీ కొనసాగే సమయంలో జనరల్ దవాఖాన సేవలు అందించేది. కాలక్రమేనా ఆ దవాఖానను మూసివేయడంతో ఏండ్లకాలంగా శక్కర్నగర్, నర్సాపూర్, ఆచన్పల్లి ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వైద్యం కోసం బోధన్లోని జిల్లా దవాఖాన లేదా, రాకాసీపేట్లోని అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కాగా, తమకు శక్కర్నగర్లో దవాఖాన కావాలంటూ కాలనీవాసులతోపాటు మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ షకీల్కు విన్నవించారు.
ఇటీవల శక్కర్నగర్ సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే షకీల్కు మరోమారు ఈ విషయామై విన్నవించడంతో ఆయన ఓ భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం గతంలో గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయానికి కొంత భాగాన్ని, ఐసీడీఎస్ వారు కొంతభాగాన్ని వినియోగించుకునే వారు. ప్రస్తుతం రెండు శాఖల వారు లేకపోవడంతో భవనం నిరుపయోగంగా మారింది. దీంతో భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే షకీల్ దానిని ‘బస్తీ దవాఖాన’గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని, అందుకోసం నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు భవనంలో కావాల్సిన సౌకర్యాల కోసం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగం నుంచి రూ.13లక్షలు మంజూరు చేయించారు.
బస్తీ దవాఖాన ఏర్పాటులో భాగంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్కు భవనాన్ని చూపిస్తున్న అధికారులు (ఫైల్)
ఓ వైద్యాధికారి.. సిబ్బంది..
శక్కర్నగర్లో ప్రారంభమయ్యే బస్తీ దవాఖానలో ఓ వైద్యాధికారి, ఓ స్టాఫ్ నర్సు, మరో అటెండర్ నియామకం జరుగుతుందని డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ విద్య తెలిపారు. ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు అందించే దిశగా బస్తీ దవాఖాన రూపుదిద్దుకోనున్నదని వివరించారు.
త్వరలో వైద్యసేవలు..
శక్కర్నగర్ ప్రాంతవాసులకు త్వరలోనే వైద్య సేవలు అందనున్నాయి. బస్తీ దవాఖాన కావాలని చేసిన సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే షకీల్ సహకారంతో ‘బస్తీ దవాఖాన’ త్వరలో ప్రారంభం అవుతుంది. నిరుపయోగంగా మారిన భవనంలో దవాఖానకు కావాల్సిన మరమ్మతులను మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దవాఖాన ఏర్పాటుకు కావాల్సిన నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే షకీల్కు కృతజ్ఞతలు.
–తూము పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్, బోధన్
దవాఖానను ప్రారంభిస్తాం..
శక్కర్నగర్లో బస్తీ దవాఖానను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాం. త్వరలోనే పనులు పూర్తి చేయిస్తాం. శక్కర్నగర్ ప్రాంతంతోపాటు చుట్టుపక్క ప్రాంతాల వారికి వైద్యసేవలు అందుతాయి. పనులు పూర్తయిన వెంటనే ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ చేతుల మీదుగా దవాఖాన ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తాం.
–జి. రామలింగం, మున్సిపల్ కమిషనర్, బోధన్