కార్పొరేట్ స్థాయి వైద్యసేవలకు బాన్సువాడ దవాఖాన కేరాఫ్గా నిలుస్తున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రైవేటులో వేలాది రూపాయలు ఖర్చయ్యే చికిత్స ఉచితంగా లభిస్తున్నది. అత్యుత్తమ వైద్య సేవలకు గాను ఇప్పటికే బాన్సువాడ దవాఖాన రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను సైతం అందుకున్నది. ఇప్పటి వరకు ఆరుసార్లు కాయకల్ప అవార్డులు వరించాయి.
బాన్సువాడ, డిసెంబర్ 1: ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు సమకూర్చడంతో కార్పొరేట్కు దీటుగా రోగులకు సేవలు అందిస్తున్నాయి. సమైక్య పాలనలో సర్కార్ దవాఖాన అంటేనే గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు జడుసుకునేవారు. సరైన వైద్య పరికరాలు, వైద్యులు లేకపోవడంతో రోగులు కొట్టుమిట్డాడే వారు. దవాఖానకు వెళ్తే పట్టించుకునే వారే కరవయ్యేవారు. స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్న రోజులు పోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో సర్కార్ దవాఖానలు అంటేనే నాణ్యమైన వైదానికి చిరునామాగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యారోగ్యశాఖలో అనేక సంస్కరణలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంచెలంచెలుగా సమూలా మార్పులు తెచ్చింది. విప్లవాత్మక మార్పులు రావడంతో ప్రభుత్వ దవాఖానలు అంటేనే ప్రజల్లో పూర్తిస్థాయిలో నాణ్యమైన వైద్యం అందుతుందనే భరోసా ఏర్పడింది. ఆధునాతన పరికరాలతో వైద్య సేవలు అందిస్తుండడంతో ‘నేను వస్త బిడ్డో సర్కార్ దవాఖాన’కు అంటూ తరలివస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో పదేండ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో బాన్సువాడ ప్రభుత్వ దవాఖాన రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సేవలు అందిస్తుండడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంటున్నది. ఒకప్పడు అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాలైన నిజామాబాద్, హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలకు తీసుకెళ్లాలని చెబుతుంటే వారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. బాన్సువాడ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికే వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. దవాఖానకు ప్రతిరోజూ సుమారు 600 నుంచి 800 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
బాన్సువాడలోని ప్రభుత్వ వందపడకల మాతాశిశు దవాఖానకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఏరియా దవాఖానలో అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి అధునాతన వైద్య పరికరాలతో వైద్యం అందించేలా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. దవాఖానలో స్కానింగ్, రక్తనిధి, ఎస్ఎన్సీయూ, డయాలసిస్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు.
వైద్యులు , సిబ్బంది అందిస్తున్న మెరుగైన వైద్య సేవలకు గాను బాన్సువాడ దవాఖాన జాతీయస్థాయిలో ఖ్యాతి గడించింది. 2017లో ఆరోగ్యశ్రీలో ఆదర్శ దవాఖానగా అవార్డు సాధించింది. ఇప్పటి వరకు ఆరుసార్లు కాయకల్ప అవార్డులు వరించాయి. 2019 నుంచి 22 వరకు వరుసగా మూడు సార్లు లక్ష్య అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. 2022-23 సంవత్సరంలో బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లి దవాఖానగా ఎంపికై జాతీయస్థాయిలో అవార్డు సాధించింది.
బాన్సువాడ దవాఖానకు వరుసగా పదుల సంఖ్యలో అవార్డులు వచ్చాయి. వైద్య విధానంలో మార్పులు, అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నాం. దవాఖానకు వచ్చే వారికి వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు విశ్వాసం పెరిగింది.
సర్కారు దవాఖానలో అన్ని వసతులు ఉన్నయి. ఎప్పుడుపోయినా డాక్టర్లు ఉంటరు. ప్రాణం బాగోలేదని పోతే చాలా మంచిగ సూస్తరు. బాన్సువాడ దవాఖానలో స్పీకర్ పోచారం సారు దయతో మంచి సౌలవుతులు ఉన్నాయి.