వర్ని/మోస్రా, ఏప్రిల్ 27: ఓట్ల కోసం దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హామీల పేరుతో మోసం చేసే దొంగలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నమ్మించి వంచించిందని, రైతులకు మోదీ సర్కారు ఢోకా చేసిందని.. ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి మోస్రా, చందూర్, వర్ని మండలాల్లో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్షోల్లో పోచారం మాట్లాడారు.
బాన్సువాడలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించానని, రూ.400 కోట్ల బిల్లులు ఇప్పించానని తెలిపారు. రూ.26 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం మారడంతో అవి మంజూరు చేయడం లేదన్నారు. బిల్లుల కోసం మంత్రిని అడిగితే ఇస్తామన్నారని, కానీ కాంగ్రెస్ నాయకులు ఇవ్వొద్దని మంత్రితో చెప్పడంతో ఇవ్వడం లేదన్నారు. నన్ను నమ్ముకుని పేదలు అప్పుచేసి ఇండ్లు కట్టుకున్నారని, వాళ్లు బాధ పడుతుంటే చూడలేనని తెలిపారు. ఎన్నికల్లోపు బిల్లులు ఇవ్వకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తానన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్ష చేస్తానని, ప్రాణత్యాగానికీ సిద్ధమని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని పోచారం విమర్శించారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జై శ్రీరామ్.. జై మోదీ అంటే కడుపు నిండదన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులకు మోదీ చేసిందేమీ లేదన్నారు. అంబానీ, అదానీలకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండని, రైతులకు నయాపైసా కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పోచారం భాస్కర్రెడ్డి, పోచారం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెప్పాలి
వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చాడని, నాలుగు నెలలు దాటినా ఇంతవరకు అమలు చేయలేదని మాజీ స్పీకర్ విమర్శించారు. డిసెంబర్ 9వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తేదీతో సహా చెప్పారని, ఇప్పుడేమో పంద్రాగస్టు అంటున్నారని ఎద్దేవా చేశారు. మే నెల వస్తున్నా ఎకరాకు రూ.15 వేల రైతుబంధు ఇస్తానన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. 18 ఏండ్లు దాటిన మహిళలందరికీ రూ.2,500 పింఛన్ వస్తదన్నారు. కల్యాణలక్ష్మి లక్ష చెక్కుతో పాటు తులం బంగారం పెడతామన్నారు. ఇందులో ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా? అని ప్రజలను ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలన్నీ మీకు అందితే కాంగ్రెస్కు ఓటెయ్యాలని, లేకపోతే ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హామీలన్నీ అమలు చేస్తే నా ఓటు కూడా కాంగ్రెస్కే వేస్తానని తెలిపారు.