నిజామాబాద్, డిసెంబర్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాదయాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొండి యాత్ర చేస్తున్నాడని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. తడిబట్టలతో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పచ్చి అబద్ధాలాడిన బండి.. ఇకపై మోకాలి యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. దేవుడిపై ప్రమాణాలు చేసే బీజేపీ నాయకులు.. తమ స్వార్థ రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఇష్టానుసారంగా మాట్లాడడంపై బాజిరెడ్డి స్పందించారు.
వాస్తవాలు మాట్లాడాలని బండి సంజయ్కి హితవు పలికారు. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇకపై చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండబోదంటూ హెచ్చరించారు. పాదయాత్రలో నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీని ఎందుకు గుర్తు చేయడంలేదని ప్రశ్నించారు. దమ్ముంటే పసుపు బోర్డు అంశంపై నోరు విప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమాలు చేసిన రోజు, తెలంగాణ జాగృతి ద్వారా ప్రజలను ఎమ్మెల్సీ కవిత జాగృతం చేసిన నాడు ఇదే భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్ లాంటి నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
గత కొన్ని రోజులుగా పాదయాత్ర పేరిట బండి చేస్తున్న హంగామా, అసంబద్ధ ప్రేలాపనలపై బాజిరెడ్డి తనదైన శైలిలో ధ్వజమెత్తారు. పసుపు బోర్డు కోసం ఎమ్మెల్సీ కవిత చేయని కృషి లేదన్నారు. ఇందుకోసం ఆమె పడిన తపన అంతా ఇంతా కాదన్నారు. పసుపు రైతుల కోసం ఎంపీగా ఉన్నప్పుడు కవిత ఎక్కని గుడి లేదని, అలాంటి నాయకురాలి గురించి తడిబట్టలతో యాదగిరి గుట్ట మెట్లెక్కి దేవుడినే మోసం చేసిన నువ్వా మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం చేసిన కృషిలో సంజయ్, బీజేపీ.. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరంటూ ధ్వజమెత్తారు. పరాయి పాలన నుంచి బయటపడిన తెలంగాణను మళ్లీ వారి చేతిలోనే పెట్టేందుకు గులాంగిరి పాదయాత్ర అంటూ బండి సంజయ్పై విరుచుకు పడ్డారు. ఎకరం భూమిలో కోటి సంపాదించడం అంటే ఆయన బురద బుర్రకు అర్థం కాదంటూ సెటైర్లు వేశారు. గంజాయి, తంబాకు తప్పా ఇంకేం గుర్తుకు వస్తుంది అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కుట్రలను ఎండగట్టేలా బరాబర్ ఆందోళన చేసుడే అంటూ బాజిరెడ్డి కుండబద్ధలు కొట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తొలుత అమాయకంగా ఫేసు పెట్టి నక్క వినయాలకు దిగిన బండి సంజయ్.. ప్రజలు, ఆయన పార్టీ కార్యకర్తలకు సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నది కేసీఆర్ కాకపోతే నీ గుజరాత్ బాసులా లేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చే నీ దొంగబాబాలా? అంటూ చురకలంటించారు. సీఎం కేసీఆర్, కవితలపై బురదజల్లే ప్రయత్నాలను మానుకొని, ప్రజలకు సంజయ్ ఏమి ఒరగబెట్టాడో చెబుతూ పాదయాత్ర చేయగలడా అంటూ సవాల్ విసిరారు.
తెలంగాణ కోసం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ప్రాణ త్యాగానికి తెగించిన రోజు ఈడీలను వాడుకునే నీ మోడీ, కేడీలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. పాదయాత్రను ఎవరూ లెక్కచేయడంలేదని, ఆదరణ పొందాలంటే ప్రజలకు మేలు చేయాలని, అలాంటి ఆలోచనే బీజేపీకి లేదన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలు వెదజల్లడమే వారి సిద్ధాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలెవ్వరూ కుటిల బీజేపీ కుట్రలో చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలని బాజిరెడ్డి కోరారు.