డిచ్పల్లి, ఏప్రిల్ 25: నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని నగర శివారులోని భూమారెడ్డి కన్వెషన్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. సమావేశానికి బండ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గడపగడపకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశమంతటా అమలు చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అవడం తథ్యమని, తెలంగాణ మోడల్ను దేశమంతా అమలు చేస్తారన్నారు.
ఒకప్పుడు గుజరాత్ను రోల్ మోడల్ అంటూ చెప్పేవారని, అక్కడ తాగేందుకు, సాగు చేసేందుకు నీళ్లు లేవని వివరించారు. మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలకు అక్కడి ప్రజలు హాజరై విజయవంతం చేస్తున్నారన్నారు. కేసీఆర్ భారత ప్రధాని కావడం పక్కా అని, దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలు సాధ్యమని అన్నారు. విభజన హామీలను తుంగలో తొక్కిన కేంద్రం, ప్రశ్నించిన వారిని సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తుందన్నారు. వైట్ మనీని అదానికి ఇచ్చి బ్లాక్మనీతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను కూలదోస్తుందని విమర్శించారు. చేవేళ్లలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ అమిత్షా మాట్లాడారని, అసలు మీది రిజర్వేషన్లు అమలు చేసే ముఖాలేనా అని ఎద్దేవా చేశారు. పసుపుబోర్డును తెస్తానని చెప్పి ఎంపీగా గెలిచిన అర్వింద్ రైతాంగాన్ని మోసం చేశారని విమర్శించారు. పసుపుబోర్డు తెచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సోదరుడిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు ఎప్పుడూ వెన్నంటే ఉంటారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ బానావత్ మంజుల, ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు,రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.