వేల్పూర్, ఏప్రిల్ 6: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుచేసేవరకు ప్రభుత్వం వెంట పడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరికి క్వింటాలుకు అదనంగా రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు పరిహారం అందజేయాలన్నారు. వేల్పూర్ ఎక్స్రోడ్డు వద్ద బాల్కొండ, వేల్పూర్, మెండోరా, ముప్కాల్ మండలాల రైతులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన రైతుదీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సాక్షిగా ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంఎస్పీ కన్నా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు గడిచినా ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదని మండిపడ్డారు.
ఎంపీ ఎన్నికలు ఉన్నప్పుడే ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేయని కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ వారికి ఓటు వేస్తే హామీలను అమలు చేస్తారా అనే విషయంపై రైతులు, ప్రజలు ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ ప్రేమించే రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి మండుటెండలో సైతం పంటలు ఎండిన ప్రాంతాలకు వెళ్లి వారిని కలుస్తూ భరోసా ఇస్తుంటే.. రేవంత్రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో బాల్కొండ నియోజకవర్గంలో రైతాంగానికి తాను ఎప్పుడు ఇబ్బందులు కలుగకుండా చూసుకున్నట్లు తెలిపారు. సాగునీరు, విద్యుత్, పంట కొనుగోలు, రైతుబంధు ఇలా ప్రతి విషయంలో రైతులు రోడ్డెక్కే పరిస్థితి లేకుండా సేవలు అందించినట్లు గుర్తుచేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, అప్పుడే ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని అన్నారు.
అర్వింద్..పసుపు బోర్డు ఆఫీస్ ఎక్కడ?
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని ప్రజలను మోసం చేసిన ఎంపీ అర్వింద్ ఇప్పటివరకు పసుపు బోర్డు తేలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయనకు రైతులు ఎందుకు ఓట్లు వేయాలని వేముల ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు పసుపు బోర్డు సాధించామని చెబుతున్నాడని మండిపడ్డారు. పసుపు బోర్డు సాధిస్తే ఆఫీస్ మెయిన్ దర్వాజ, ఆఫీస్, ఆఫీస్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. ఇంకా ప్రజలను అబద్ధపు మాటలతో మోసం చేయలేవన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం ఎప్పుడూ ముందుంటానని అన్నారు. భయపడి వెనక్కి పోయేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరం వచ్చినప్పుడు వారి వైపు నిలబడకుండా కేవలం మూడు నెలలకే అధికార పార్టీలోకి వెళ్లిన నీచులపై ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాడుతూ ఉంటానని అన్నారు. తనపై ఎన్ని కేసులు అక్రమంగా పెట్టాలని చూసినా వెనక్కి వెళ్లేదిలేదన్నారు.