ధర్పల్లి, మార్చి 1 : ఇండోనేషియాలో ఆయిల్పామ్ తోటలు, ఇండస్ట్రీలను విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో కలిసి పరిశీలించినట్లు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తెలిపారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు కామారెడ్డి జిల్లాలో ఆయిల్పామ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా వారితో కలిసి ఇండోనేషియాలో పర్యటించినట్లు తెలిపారు.
ఇందూరు రైతులు ఆయిల్పామ్ పంటను సాగుచేసి అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ఇక్కడి మెళకువలను తెలుసుకొని రైతులకు వివరించేందుకు ఫిబ్రవరి 26న ఇండోనేషియాకు వచ్చినట్లు తెలిపారు. సంపూర్ణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ విశ్వతేజ సంస్థ ప్రతినిధులు ఇండియాకు ఆయిల్పామ్ సీడ్స్ను సరఫరా చేస్తారని తెలిపారు. పాలెంవ్యాంగ్ అనే సిటీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయిల్పామ్ పంట సాగు, కోత విధానం, మేలు రకమైన విత్తనాల ఎంపిక, ఇండస్ట్రీల పనితీరును పరిశీలించినట్లు చెప్పారు. జిల్లాలోని రైతులు ఈ పంటపై దృష్టి సారించేలా ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తానన్నారు. పర్యటనలో విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం నవీన్కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపనిత్ రాజోర్య, డైరెక్టర్లు నిఖిల్రెడ్డి, లింగారెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు.