ధర్పల్లి, ఆగస్టు 31 : బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకునే పార్టీలని తెలంగాణ గోస తీర్చి పదేండ్లలో దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్వన్గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం ధర్పల్లిలో పర్యటించిన ఆయన ముందుగా కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం హోన్నాజీపేట్, రేకులపల్లి గ్రామాల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ మండలానికైనా అభివృద్ధి నిధులతో వస్తున్నానని దీనికి కారణం సీఎం కేసీఆర్ అందిస్తున్న పుష్కలమైన అభివృద్ధి నిధులే కారణమన్నారు.
ఎన్నికలు వస్తేనే ప్రజల యోగాక్షేమాలు గుర్తుకొచ్చే పార్టీలు కావాలా, ప్రతి క్షణం ప్రజల వెంటే ఉండి అభివృద్ధి కోసం పరితపించే మాలాంటి నాయకులు కావాలో అక్కాచెలెళ్లు ఆలోచించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు. ధర్పల్లి పెద్దచెరువు, రామడ్గు ప్రాజెక్టుల్లో బోటింగ్ పాయింట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ధర్పల్లితో పాటు చుట్టుపక్కల మండలాల్లోని పల్లె ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 100 పడకల దవాఖాన ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ సైతం పూర్తయ్యిందని, త్వరలోనే పనులు సైతం చేపట్టడం జరుగుతుందన్నారు. మండలానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సహకారంతో అంబులెన్స్ ఏర్పాటు చేశామని శుక్రవారం మండలానికి నూతన అంబులెన్స్ వస్తుందన్నారు.
ప్రజల కోసం, వారి సమస్యలు తీర్చడం కోసం ప్రతిపక్ష పార్టీలు చేసిందేమీ లేకపోగా అభివృద్ధిని అడ్డుకునేలా ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు చేయాలని చూస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్న తమను ఆశీర్వదిస్తే ఇంతకు రెట్టింపు అభివృద్ధిని చేసి చూపుతామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. ఎమ్మెల్యే నిధులతో నిర్మించిన పద్మశాలీ సంఘ భవనాన్ని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. సంఘ భవనంపైన ఉండి వీక్షించి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్లో పలువురి చేరిక బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు శంకర్, కాంగ్రెస్ నాయకులు లాలాగౌడ్ శ్రీనివాస్గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.