గాంధారి, ఏప్రిల్ 4: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకొచ్చిన మద్యం బాటిళ్లను చోటా మోటా నాయకులు పక్కదారి పట్టించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా గ్రామాల్లోని తమ అనుచరులతోపాటు గల్లీ లీడర్ల ద్వారా పెద్ద ఎత్తున మద్యాన్ని నిలువ చేసి ఉంచాయి. ఇదే అదనుగా భావించిన చాలా మంది నాయకులు భవిష్యత్తులో జరగబోయే సర్పంచ్(స్థానిక స్థంస్థల) ఎన్నికల్లో తాము పోటీ చేస్తే ఈ మద్యం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో భారీగా లిక్కర్ బాటిళ్లను గ్రామాల్లోని తమ అనుచరుల ఇండ్లు, రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచినట్లు ఆయా పార్టీల నాయకులు బహిరంగంగానే చర్చిస్తున్నారు. ఎన్నికల్లో గ్రామస్థాయిలోని చోటా మోటా లీడర్లను నమ్మి వారి వద్ద మద్యం నిలువను ఉంచితే, తప్పుడు లెక్కలు చూపించి, ఆయా పార్టీలకు చెందిన పెద్దలను మోసం చేశారని కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు. గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో పోలీసులు 180 మద్యం క్వార్టర్ బాటిళ్లను బుధవారం పట్టుకోవడంతో ఈ చర్చ మొదలైంది. పట్టుబడిన మద్యం కాంగ్రెస్ పార్టీకి చెందినవారిదేనని, త్వరలో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల కోసమే నిల్వ చేసి ఉంచినట్లు గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు.
అక్రమంగా మద్యం నిలువ చేసినా, బెల్టు దుకాణాలు నడిపినా కేసులు నమోదు చేస్తాం. గాంధారి మండలంతోపాటు ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని చాలా గ్రామాల్లో మద్యం నిల్వలు ఉన్నట్లు తెలిసింది. అలాంటి వారిపై పక్కా సమాచారంతో దాడి చేసి మద్యం బాటిళ్లను పట్టుకుంటాం. బెల్టు షాపులు నడిపినా, అక్రమంగా మద్యం నిల్వ చేసిన వారి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.