ఖలీల్వాడి, ఫిబ్రవరి 10: బీసీల నెత్తిపై కాంగ్రెస్ కత్తి వేలా డుతున్నదని, రేవంత్ సర్కార్ వారిని నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షు డు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. కుల గణన పేరుతో ఇటీవల నిర్వహించిన బోగస్ సర్వే తో పోయింది కాంగ్రెస్ పరువేనని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలబెట్టడం కాంగ్రెస్ నైజమని, బడుగుల ను ఏమార్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కార్ వారి గొంతుకోసిందని మండిపడ్డారు. రాజకీయ స్వార్థం, కుయుక్తులు లేకుండా రీ సర్వే చేస్తేనే బీసీ జనా భా ఎంత అన్న విషయంలో కచ్చితమైన గణాంకాలు వెలుగుచూస్తాయని తెలిపారు.
బీసీల ఓట్ల కోసం వారిని ఏమార్చేందుకు పచ్చి అబద్ధాలతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ జనాభాను ఐదున్నర శాతం తక్కువగా చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మగౌరవంపైనే దెబ్బ కొట్టిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేసన్ల హామీని రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ కులతత్వ రాజకీయాలు చూసి బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డి సభలో 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని, బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్ప్లాన్ తీసుకొస్తామని కాంగ్రెస్ నమ్మబలికిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీసీల జనాభాను ఐదున్నర శాతానికి తగ్గించి దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చిత్రీకరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్నీతిని బీసీలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణకు చీడ, ప్రజలకు పీడ అని అభివర్ణించారు. బీసీలకు అండగా గులాబీ జెండా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ చీటింగ్ చేసిన చోట నుంచే సర్కార్పై ఫైటింగ్ మొదలు కావాలన్నారు. కామారెడ్డిలో కొడితే రేవంత్రెడ్డి ప్రభుత్వం కోమాలోకి పోవాలన్నారు. బీసీల దెబ్బకు కాంగ్రెస్ ఏసీ కోటలు కూలాలన్నారు. కేసీఆర్ హయాంలోనే బీసీలకు స్వర్ణయుగమని గుర్తుచేశారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు బీసీల పోరులో కదం తొక్కాలని, బీసీలకు జరిగిన ద్రోహంపై ప్రజల్లో చర్చ జరగాలని కోరారు. కుల గణన రీ సర్వే జరిగే వరకు పోరు ఆగదని జీవన్రెడ్డి స్పష్టంచేశారు.