నిజాంసాగర్, ఫిబ్రవరి 29: బీడువారిన పొలాలు…ఎండిన చెరువులు.. తెగిన చెరువు కట్టలు.. మరమ్మతులకు నోచుకోని చెరువులు.. చుక్కా నీరు పోయని బోర్లు.. ఇదంతా పదేండ్ల కిందట సమైక్యపాలనలోని దుస్థితి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేండ్లపాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మండు వేసవిలోనూ నిండుకుండలా చెరువులు మారాయి. పాతాల గంగ బోర్ల నుంచి ఉబికి వచ్చింది. పచ్చని పంటలతో కళకళలాడుతూ దర్శనమిచ్చాయి. కానీ ప్రస్తుతం మళ్లీ పాత రోజులే వచ్చాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. బోరుబావులు వట్టిపోతున్నాయి. సాగునీరందక పంటలు చేతికి అందే పరిస్థితి లేకుండా పోతున్నది.
ఒకవైపు చెరువులు ఎండిపోతుండగా మరోవైపు భూగర్భజలాలు సైతం ఇంకిపోతున్నాయి. నెలనెలా నీటి నిల్వలు పడిపోతున్నాయి. గతేడాది జనవరిలో 8.85మీటర్లలో భూగర్భజలాలు ఉండగా ఈ ఏడాది జనవరి నాటికి 10.05 మీటర్లకు పడిపోయింది. కామారెడ్డి జిల్లాలోని మండలాల వారీగా చూస్తే భిక్కనూర్, మాచారెడ్డి, పెద్దకొడప్గల్, దోమకొండ, బీబీపేట, నిజాంసాగర్ మండలాల్లో భూగర్భజలాలు మరింత పడిపోతుండడంతో బోరుబావులు వట్టిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత క్షీణించే అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలా గ్రామాల్లో బోరు మోటర్లు ఆగుతూ పోస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో యాసంగిలో సైతం అధిక శాతం వరి సాగు చేస్తున్నారు. భూగర్భ జలమట్టం రోజురోజుకూ పడిపోతుండడంతో బోరుబావుల నుంచి నీరు రాక కండ్ల ముందే పంటలు ఎండుతున్నాయి. నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్, నర్సింగ్రావ్పల్లి గ్రామాల్లో ఇప్పటికే చాలావరకు బోరుబావులు వట్టిపోయాయి.
రూ.లక్ష పెట్టి ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. నాలుగు ఎకరాల్లో జొన్న, రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. మూడో బోరుబావులు ఉండగా ప్రస్తుతం రెండు మాత్రమే నీటిని అందిస్తున్నాయి. అందులో ఒక బోరు పది రోజుల నుంచి ఆగుతూ నీళ్లు పోస్తున్నది. రోజుకు ఎకరం పొలానికి కూడా నీరందడం లేదు. మరో నెల రోజులు గడిస్తే పంట చేతికి అందేలా లేదు. కౌలు డబ్బులతోపాటు పెట్టుబడి డబ్బులు కూడా చేతికి వస్తాయనే నమ్మకం లేదు.
నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది. మూడు బోర్లు ఉండగా, ఒకదాంట్లో పూర్తిగా నీరు రావడం లేదు. మిగిలిన బోర్లు కూడా ఆపుతూ పోస్తుండడంతో వరి పంటకు నీరు సరిపోవడం లేదు. మార్చి, ఏప్రిల్లో పరిస్థితి ఎలా ఉంటుందో. పంట చేతికి అందేలా కనిపించడం లేదు. రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టిన. చేతికి అప్పులే మిగిలేటట్లు కనిపిస్తున్నది.
జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉన్నది. జనవరి నుంచి ఇప్పటి వరకు 1.65మీటర్ల లోతుకు పడిపోవడంతో బోరుబావుల్లో నీటి లభ్యత క్షీణించే ప్రమాదం ఉన్నది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కావడం, యాసంగిలో వరి సాగు అధికంగా సాగు చేయడమూ ఒక కారణమే.