ఇందల్వాయి/ నిజామాబాద్ క్రైం/ఆర్మూర్/ శక్కర్నగర్, ఏప్రిల్ 15 : అగ్నిమాపక వార్షికోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్తో పాటు బస్టాండ్, మాల్స్ ఏరియాల్లో ప్రమాదాల నివారణకు పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలపై వివరించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏ విధంగా మంటలను అదుపు చేస్తారో ప్రయోగాత్మకంగా వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి.నర్సింగ్ రావు, ఆర్టీసి డిపో మేనేజర్ ఆనంద్తోపాటు ఫైర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ ద్వారా సంభవించే అగ్ని ప్రమాదాల నివారణపై ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎస్ఎఫ్వో కాంతారావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్ సురేశ్, శ్రీనివాస్, డీవో ఫైర్మన్ జైపాల్, సతీశ్, హోంగార్డ్ మధు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్లోని ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, అంబేద్కర్, పెర్కిట్ చౌరస్తా ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రధాన కూడళ్లలో అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్మూర్ అగ్నిమాపక కేంద్రం అధికారి మధుసూదన్రెడ్డి, ప్రకాశ్ పాల్గొన్నారు.
బోధన్ బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పే తీరును ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో అధికారి గంగాదాస్, ఎం.నర్సయ్య, అనీల్, ఎండీ అమీరుద్దీన్, రాములు, సిబ్బంది ఉన్నారు.