ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 9 : రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట్ గ్రామంలో వృద్ధురాలి హత్య కేసులో మృతురాలి కొడుకు, కోడలిని రిమాండ్కు పంపుతున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన పోచవ్వ (57) మృతిపై దర్యాప్తు నిర్వహించామన్నారు. మృతురాలు పోచవ్వకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురికి వివాహం అయ్యింది. ఇంట్లో కొడుకు సంజీవులు, కోడలు సరిత, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.
సంజీవులు చిన్నచిన్న కూలీ పనులు చేసేవాడు. సంజీవులుకు అప్పులు కావడంతో తల్లిపేరుపై ఉన్న 8 గుంటలను అమ్ముకున్నాడు. అయినా అప్పులు తీరకపోవడంతో తల్లిపేరుపై ఉన్న మిగతా రెండు ఎకరాల భూమిని ఆమ్ముకుంటానని తల్లితో గొడవ పడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 7వ తేదీ రాత్రి తల్లితో గొడవపడ్డ సంజీవులు.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రపోతున్న తల్లిని చంపడానికి పూనుకున్నాడు. తల్లి మెడకు టవల్ చుట్టి లాగగా పెనుగులాడుతుండగా భార్య సరిత సహాయం తీసుకున్నాడు. మెడకు చుట్టిన టవల్ను ఇద్దరు చెరోపక్కకు గట్టిగా లాగడంతో పోచవ్వ మృతిచెందింది. ఉదయం తల్లి నిద్ర నుంచి లేవడం లేదని చుట్టుపక్కల వారికి తెలిపాడు.
గ్రామస్తులతో పాటు అక్కడికి చేరుకున్న పోచవ్వ కూతురికి అనుమానం వచ్చి నిలదీయగా సంజీవులు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో 8వ తేదీ బుధవారం గండిమాసానిపేట్ గ్రామంలో సంజీవులును అదుపులోకి తీసుకొని విచారించగా అప్పులు తీర్చడానికి పొలం అమ్ముదామంటే అడ్డు వస్తున్న తల్లిని.. భార్య సహాయంతో చంపినట్లు ఒప్పుకున్నాడు. సంజీవులు ఇచ్చిన సమాచారం మేరకు పోచవ్వ మెడకు చుట్టిన టవల్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని రిమాండ్కు పంపుతున్నామన్నారు. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్, హోంగార్డు వీరప్రసాద్ను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.