కామారెడ్డి, డిసెంబర్ 2: శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్ సిబ్బంది రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో కౌంటింగ్ పరిశీలకులు చిఫంగ్ అర్దుర్ వర్చుయో, జగదీశ్, అభయ్ నందకుమార్ కరగుట్కర్ సమక్షంలో శనివారం ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ పూర్తయిన తర్వాత కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కోసం కామారెడ్డిలోని ఏఎంసీ గోదాంలో, నిజామాబాద్ జిల్లా కౌంటింగ్ కేంద్రాలకు తరలించి సాయుధ బలగాల పహారా నడుమ స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 75మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 54 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 62 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, రిజర్వు సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచామన్నారు. వీరికి ఇప్పటికే పలు విడుతలుగా మాస్టర్ ట్రైనర్లతో కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ ఇచ్చామన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధూ శర్మ పరిశీలించి పోలీసు, కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తూ, 18 నుంచి 20 రౌండ్ల వారీగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం కామారెడ్డి నియోజకవర్గంలో 4 టేబుళ్లు, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రెండు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ నిర్వహణపై ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. మూడో విడుత కౌంటింగ్ సిబ్బంది, ర్యాండమైజేషన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 5 గంటలకు రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు మను చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, సీపీవో రాజారాం, రఘునందన్, దయానంద్, సతీశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.