జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. శివారు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని గ్రామాలు, మండలాలు, పట్టణ శివారు, అటవీ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడే వారిని డ్రోన్ సహాయంతో గుర్తిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాలకు వెళ్లకుండా తాము ఉన్నచోటు నుంచే పసిగడుతున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలను ఉపయోగించి శివారు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 12 : నిజామాబాద్ జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు కొంత కాలం క్రితం నుంచి పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను పసిగట్టేందుకు ప్రత్యేకంగా ‘డ్రోన్ నిఘా’ను వినియోగిస్తున్నారు. ప్రధానంగా గ్రామాలు, మండలాలతో పాటు నగర శివారు ఏరియాలు, అటవీ ప్రాంతాల మాటున ఇప్పటి వరకు జరిగిన పేకాట, కోళ్ల పందేలు లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించేందుకు పోలీసులు అక్కడి వరకు వెళ్లకుండా తాము ఉన్న చోటి నుంచే దృష్టి సారిస్తున్నారు. అందు కోసం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మూడు డివిజన్ల ఏసీపీల పర్యవేక్షణలో సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఏరియాల ఎస్సైలు తమ సిబ్బందితో కలిసి డ్రోన్ ద్వారా నగర, గ్రామ శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ కెమెరా ద్వారా శివారు ప్రాంతాల్లో మారుమూల ఏరియాలో గుట్టు చప్పుడు కాకుండా జరగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను సులువుగా గుర్తిస్తున్నారు.
కొంత మంది జూదరులు అటు పోలీసులు, ఇటు చుట్టు పక్కల ఉండే వారికి తెలియకుండా శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు.అలాంటి వారి సమాచారం ఎవరికీ తెలియకుండా గోప్యంగానే ఉంటుంది. అయితే ఇలాంటి పేకాట రాయుళ్ల అడ్డాలను తెలుసుకొని పోలీసులు దాడి చేసేందుకు వారి పరిసర ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో పేకాటరాయుళ్లు తమ అడ్డాల నుంచి పారిపోయిన సంఘటనలు సైతం లేకపోలేదు.
ఇది గ్రహించిన పోలీసులు కొత్త టెక్నాలజీ ద్వారా శివారు ఏరియాలో పేకాట ఆడుతున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లను తమ వద్ద ఉండే రిమోట్ కంట్రోల్ ద్వారా పోలీసులు ఆపరేట్ చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న స్థావరాలను గుర్తిస్తున్నారు. దీంతో డ్రోన్ వారు ఉండే ప్రాంతాలను కవర్ చేస్తూ అందులో ఉన్న కెమెరాల ద్వారా వారి ఫొటోలను తీస్తుంది. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు డ్రోన్ కెమెరా సహాయంతో పోలీసులకు దొరికిపోతున్నారు.
చాలామంది మందుబాబులు అనుమతి పొంది బార్లలో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సిట్టింగులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి మద్యం సిట్టింగ్ స్థావరాలను గుర్తించేందుకు సైతం పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ వారిని పట్టుకొని కేసులు నమోదు చేసిన సంఘటనలు సైతం చాలా ఉన్నాయి.
ర్యాలీలు, శోభాయాత్రల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే దానికి కారకులైన వారిని సులువుగా గుర్తించేందుకు ఈ డ్రోన్ కెమెరాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు, జనం పాల్గొనే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర, హన్మాన్ జయంతి లాంటి ఉత్సవాల సమయంలో ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టేందుకు సైతం ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. జనంలోకి వెళ్లేందుకు వీలుపడకపోవడంతో ఈ వినూత్న చర్యలు చేపట్టారు. ర్యాలీలు,శోభాయాత్రలు నిర్వహించే ఏరియాలో పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా జనం కదలికల పై నిఘా పెడుతున్నారు. దీని ద్వారా ఎవరు ఏ వైపు నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఎంత మంది జనం శోభాయాత్ర, ర్యాలీలోకి వచ్చి చేరారనే సమాచారాన్ని పోలీసులు పసిగడుతున్నారు.
డ్రోన్ కెమెరాలను వినియోగించి పోలీసులు ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించిన దాఖలాలు ఉన్నాయి. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ ద్వారా గుర్తించి వారిని పట్టుకొని కేసులు నమోదు చేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ జనానికి ఇబ్బందులు కలిగించే వారిని సైతం డ్రోన్ సహాయంతో పసిగట్టి వారి పై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడంతో పాటు కోర్టులో సైతం హాజరుపరిచారు.
2020లో కరోనా విజృంభించిన సమయంలో సైతం పోలీసులు ఈ డ్రోన్ కెమెరాల ద్వారా జనం ఇండ్ల నుంచి బయటికి రాకుండా కట్టడి చేశారు. ఆ సమయంలో అన్ని ప్రాంతాల్లోకి పోలీసులు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ఎక్కడైనా జనం ఇండ్ల నుంచి బయటికి వచ్చినట్లయితే వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను పోలీసులు వినియోగించారు. అంతే కాకుండా నిబంధనలు అతిక్రమించి ఇండ్లలోంచి బయటికి వచ్చి వారిని గుర్తించి వారిపై కేసులు సైతం నమోదు చేశారు.
జిల్లాలో నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు డ్రోన్ ఎంతో సహాయపడుతున్నది. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పూర్తి సమాచారం, ఫొటోలతో సహా పోలీసులు నిమిషాల్లో తమ వద్దకు తెపించుకుంటున్నారు. ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు రక్షణగా ఉన్నారనే భరోసా కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం రాత్రింబవళ్లు పని చేస్తుంది.