రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. గత పాలకుల నిర్లక్ష్యంతో నిస్తేజంగా మారిన వ్యవసాయ రంగానికి జవసత్వాలు కల్పిస్తున్నది. అన్నదాతల సంక్షేమమే పరమావధిగా ముందుకు ‘సాగు’తున్నది. 24 గంటల ఉచిత కరెంట్తో పాటు విత్తనాలు, ఎరువుల ఖర్చుల కోసం పెట్టుబడి సాయం, బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నది. సమైక్య పాలనలో క‘న్నీటి’ గోస పడ్డ రైతాంగానికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. రూ.వేల కోట్లు వెచ్చిస్తూ సాగు నీటి సమస్యలు లేకుండా చూస్తున్నారు. కాళేశ్వరం పథకంతో మహాద్భుతాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. ప్యాకేజీ 20, 21, 22 ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే దిశగా కృషి చేస్తున్నారు. గోదావరి నదీ జలాలను బీడు భూములకు తరలించాలనే ఉద్దేశంతో నిర్మించిన చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం కేసీఆర్ సర్కారు ఊపిరి పోసింది. సీఎంతో పాటు మంత్రి వేముల కృషితో సాంకేతిక అడ్డంకులు పూర్తిగా తొలగి పోయాయి.
– నిజామాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నదీ జలాల వినియోగం పై రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందుకు పోతోంది. రాష్ర్టానికి దక్కిన న్యాయమైన వాటాను వినియోగించుకునేందుకు రూ.వేల కోట్లు వెచ్చించి రైతుల ప్రయోజనాలను సీఎం కేసీఆర్ కాపాడుతున్నారు. కాళేశ్వరం పథకంతో మహాద్భుతాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే దిశగా పాటు పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21, 22 కింద చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా గతంలో ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కొంగొత్త రూపును తీసుకువస్తున్నారు. గోదావరి నదీ జలాలను బీడు భూములకు తరలించే ఉద్దేశంతో ఏం డ్ల క్రితం బీజం పడిన చౌట్పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి సై తం కేసీఆర్ సర్కారు ఊపిరి పోసింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కమ్మర్పల్లి, మోర్తా డ్ మండలాల్లోని పదుల సంఖ్యలోనే గ్రామాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బాల్కొండ నియోజకవర్గాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇరిగేషన్ సర్క్యూట్గా తీర్చిదిద్దుతున్నారు. కేసీఆర్ పరిపాలనలో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకుపోతున్నారు. ఎస్సారెస్పీ సజీవ జల దృశ్యంగా ఉంచేందుకు ఇప్పటికే పునరుజ్జీవ పథకాన్ని కేసీఆర్ ఆశీస్సులతో చేపట్టారు. తద్వారా ఏడాది పొడవునా శ్రీరాంసాగర్లో జల కాంతులు ప్రజ్వరిల్లే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు పక్కనే భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఉన్నప్పటికీ గోదావరి జలాల ప్రవాహం లేని ప్రాంతాలకు లిఫ్ట్ సౌకర్యాలను కల్పిస్తూ మేలు చేకూరుస్తున్నారు. చౌట్పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు వంటి పథకానికి సీఎం కేసీఆర్ సారథ్యంలో ఊపిరి పోస్తున్నారు. నిధుల కొరత లేకుండా చూస్తూనే పథకం ద్వారా వేలాది మంది రైతుల మనుగడకు ఆయువుపట్టుగా నిలుస్తున్నారు. కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు మంజూరు కావడంతో బాల్కొండ నియోజకవర్గ రైతన్నలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేని ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు పొందాలన్న ఆదేశాలతో కదిలిన తెలంగాణ సర్కారు అందుకు తగిన సహేతుకమైన సాంకేతిక పరమైన అంశాలను కేంద్ర జల సంఘం ముందుకు తీసుకువచ్చింది. వీటిపై పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కొర్రీలు పెట్టింది. పలు అభ్యంతరాలను సైతం వ్యక్తం చేసింది. మూడు ప్రాజెక్టులపైనా లేనిపోని కారణాలను చూపింది. అయినప్పటికీ గోదావరి నదీ జలాల వాటా ప్రకారమే తెలంగాణ సర్కారు న్యాయబద్ధంగానే ముందుకు సాగుతుండడాన్ని కేంద్ర జల సంఘం గుర్తించింది. వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా టెక్నో ఎకానమిక్ క్లియరెన్స్ ఇవ్వొచ్చని కేంద్ర జల్ శక్తి శాఖకు సిఫార్సు చేయడంతో గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అయ్యింది. చౌట్పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి మార్గం సుగమం కావడంతో నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గ పరిధిలో కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో 18 గ్రామాలకు లాభం చేకూరబోతున్నది. సుమారు 10వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మి కెనాల్ డిస్ట్రిబ్యూటరీ నుంచి తరలిస్తున్న నీళ్లను బీడు భూములకు మళ్లిస్తారు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొంత కాలంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణను అడుగడుగునా అడ్డుకుంటున్నది. ఆర్థిక పరమైన ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేయడంతోపాటు రైతు ప్రయోజనాలను సైతం దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నది. దీంతో రైతులోకంలో కేసీఆర్ సర్కారుపై వ్యతిరేక ముద్రను వేసేలా కుటిల నీతికి పాల్పడుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర సర్కారు ఆధీనంలో ఉన్న నదీ జలాల బోర్డులను వాడుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. గత కాంగ్రెస్ హయాంలోనే పునాది పడిన చౌట్పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి 2021, జూలైలో రివర్ బోర్డు గెజిట్ ప్రకారం కొత్తగా అనుమతులు పొందాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా డిటైల్ ప్రాజెక్టు రిపోర్టులను 2021, సెప్టెంబర్ నెలలోనే సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ), గోదావరి బోర్డుకు నివేదించింది. సీడబ్ల్యూసీ పరిధిలోని నిపుణుల బృందాలు డీపీఆర్లను నిశితంగా పరిశీలన జరిపింది. 2022 ఏప్రిల్లో జరిగిన 13వ బోర్డు మీటింగ్లోనూ చౌట్పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం, చనాకా – కొరటా ప్రాజెక్టులపై చర్చ జరిగింది.
శెట్పల్లి ఊరచెరువును రిజర్వాయర్గా ఉంచడంతో ఎల్లప్పుడూ చెరువులో నీళ్లు ఉంటాయి. శెట్పల్లితోపాటు ధర్మోరాకు కూడా ప్రయోజనమే. ఎత్తిపోతల కారణంగా రెండుగ్రామాల్లో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయి.
– రాజేందర్, ధర్మోర
చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకం మోర్తాడ్, కమ్మర్పల్లి గ్రామాల చెరువులను నింపేందుకు నిర్మించినది. ఈ పథకానికి టెక్నికల్ ఎకనామికల్ క్లియరెన్స్ లభించడం ఎంతో సంతోషకరం. సాగునీటిని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుందో మరోసారి రుజువయ్యింది.
-మహేందర్, రైతు, కమ్మర్పల్లి
హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకంతో కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల చెరువులు జలకళను సంతరించుకుంటాయి. ఇలాంటి ఎత్తిపోతల విషయంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ కృషితో ఎత్తిపోతలకు క్లియరెన్స్ లభించడం రైతాంగానికి సంతోషకరమైన విషయం.
– మల్కాయి రాజన్న, రైతు, కమ్మర్పల్లి
హన్మంత్రెడ్డి ఎత్తిపోతల ద్వారా చెరువులు నింపడం తో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. చెరువుల్లో నీళ్లు ఉండడంతో భూగర్భజల మట్టం పెరుగుతుంది. దీంతో సాగునీటి కష్టాలు తీరుతాయి. ఇలాంటి ఎత్తిపోతలకు క్లియరెన్స్ లభించడం సంతోషకరం. దీనికి కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి రైతాంగం తరఫున కృతజ్ఞతలు.
– బాల మల్లేశ్, రైతు, వడ్యాట్