కంఠేశ్వర్, ఏప్రిల్ 30: రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లోని లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)ఫీజు చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎల్ఆర్ఎస్ -2020 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్లాట్ యజమానులకు ఈ వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం 2026 మే 1 నుంచి జూలై 31 వరకు మూడు నెలల కాలంలో ఫీజు చెల్లించే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తూనే ఏండ్ల తరబడి పెండింగ్లోని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ అరుదైన అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.