నిజామాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఉద్యోగాలను సాధించేందుకు చక్కని అవకాశంగా భావించే గ్రూప్- 1 నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో తొలిసారి గ్రూప్ -1 ప్రకటన రావడంతో నిరుద్యోగ యువతలో సంతోషం వెల్లివిరుస్తోంది. 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఉద్యోగార్థులు సీరియస్గా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తయ్యింది. రాష్ట్రంలో తొలిసారిగా వివిధ శాఖల్లో ఉన్నత ఉద్యోగాల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్కు తగ్గట్లుగానే సీఎం కేసీఆర్ పరిపాలనలో దూసుకుపోతున్నారు. ఏడున్నరేండ్ల కాలంలో తొలిసారి ఈ ప్రకటన రావడంతో వయో పరిమితిని ప్రభుత్వం ఇదివరకే పెంచింది. దీంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలోపు ఉంటే సరిపోతుంది.
సమైక్య పాలనలో గ్రూప్ -1, 2 ఉద్యోగాలంటేనే అదో ప్రహసనం. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందంటే వివాదాల పుట్టగా మారేది. పోస్టులకు ధరలను నిర్ణయించి ఇష్టారాజ్యంగా జాబులను అమ్ముకునేవారు. బాహాటంగానే ఏపీపీఎస్సీలో పని చేసే వారంతా ఇంటర్వ్యూల రూపేణా అభ్యర్థుల నుంచి డబ్బులు దండుకునేది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పోస్టుల భర్తీని చేపట్టేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నది. మంత్రివర్గ సమావేశంలో చర్చించి గ్రూప్ – 1, 2 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేసింది. దీంతో మౌఖిక పరీక్ష అనే పద్ధతికి చెల్లుచీటి పడినట్లు అయ్యింది. వాస్తవానికి ఇంటర్వ్యూల ద్వారా చాలా వరకు పోస్టుల భర్తీలో గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ పద్ధతి రద్దు చేయడం ద్వారా ప్రిలిమ్స్, మెయిన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికే పోస్టులు దక్కనున్నాయి. తద్వారా పారదర్శకత అనేది పోస్టుల భర్తీలో స్పష్టంగా కనిపించబోతున్నది.