నిజాంసాగర్, ఫిబ్రవరి 28: ఏడాది కుమారుడిని రోడ్డుపై వదిలేసి తల్లి అదృశ్యమైన ఘటన మహ్మద్నగర్ మండలంలోని గాలీపూర్లో బుధవారం చోటు చేసుకున్నది. బాధితురాలి సోదరుడు శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన ఆందోల్ శిరీష అలియాస్ పద్మ(25)ను మూడేండ్ల కిందట ఎల్లారెడ్డి మండలం గండిమాసన్పేట్కు చెందిన ఆందోల్ సతీశ్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సంవత్సరం బాబు యోగేశ్ ఉన్నాడు. ఈ నెల 17వ తేదీన యోగేశ్ పుట్టిన రోజు వేడుకలు సైతం ఘనంగా నిర్వహించారు. బుధవారం గండిమాసన్పేట్ నుంచి శిరీష మెట్టెలు చేయించుకునేందుకు తల్లిగారింటికి బయల్దేరగా, భర్త సతీశ్ ఎల్లారెడ్డిలో బస్సు ఎక్కించి ఇంటికెళ్లాడు. శిరీష బాన్సువాడలో దిగాల్సి ఉండగా గాలీపూర్ సమీపంలోని గేటు వద్ద దిగింది.
అక్కడి నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న బోధన్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై కుమారుడు యోగేశ్ను వదిలి అదృశ్యమైంది. రోడ్డుపై బాబు ఏడుస్తూ కనిపించడంతో ప్రయాణికులు బాబును చేరదీశారు. సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువ ఒడ్డుపై చెప్పులు, బ్యాగు ఉండడంతో తనిఖీ చేయగా శిరీష ఆధార్ కనిపించింది. దీంతో స్థానికులు డయల్100కు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాబును తీసుకొని శిరీష కుటుంబసభ్యులకు అప్పగించారు. అల్లుడి వేధింపులతోనే తన బిడ్డ ప్రధాన కాలువలో పడిందని శిరీష తల్లి లక్ష్మి రోదించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి, ప్రధాన కాలువకు కొనసాగుతున్న నీటి విడుదలను నిలిపివేశారు.