నిజామాబాద్ కలెక్టరేట్లో పోలింగ్పై వయోవృద్ధులకు మంగళవారం కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఖలీల్వాడి, ఆగస్టు 22 : ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం వయోవృద్ధులకు పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాల పనితీరుపై ప్రయోగాత్మకంగా వివరిస్తూ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేపడుతూ వివిధ రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే 80 ఏండ్లు పైబడిన వారు, దివ్యాంగులు తమ ఇంటి నుంచే ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించిందని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, స్వీప్ నోడల్ అధికారి సింహాచలం, జిల్లా సంక్షేమాధికారిణి రసూల్ బీ, సీనియర్ సిటిజన్స్ ఫోరం, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు భూమన్న, రవీందర్, రామ్మోహన్ పాల్గొన్నారు.