ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి శ్రీరాంసాగర్… దిగువ 300కిలోమీటర్ల నుంచి వరద కాలువ ద్వారా ఎదురెక్కుతూ ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కాళేశ్వరం జలాలు కలిసే అద్భుత ఘట్టాన్ని చూస్తున్న రైతులంతా సంబురపడుతున్నారు. కింది నుంచి నీళ్లు పైకి ఎక్కిరావడం సాధ్యం కాదని వెక్కిరించిన నోళ్లకు తాళం పడేలా చేసిన నేతలను మనసారా దీవిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముందుగా చెప్పినట్లుగానే… కాళేశ్వరం నీళ్లు తెచ్చిండ్రు.. మా రంది తీర్చిండ్రు అంటూ వేనోళ్ల కొనియాడుతున్నారు. కమ్మర్పల్లి మండలం కోనాసముందర్, అమీర్నగర్, నర్సాపూర్, ఇనాయత్నగర్ గ్రామాల రైతులు గురువారం ముప్కాల్ పంప్హౌస్ను సందర్శించారు. పంప్హౌస్ నుంచి వస్తున్న కాళేశ్వరం జలాల సవ్వడి వింటూ ఆనంద పరవశు లయ్యారు. సెల్ఫీలు తీసుకుంటూ ఇవన్నీ కేసీఆర్ నీళ్లేనంటూ ముచ్చ టించుకున్నారు. కాళేశ్వరం జలాలను అందించిన మంత్రి వేములపై మహిళా రైతులు పాటలు కట్టి పాడారు. అనంతరం ప్రశాంత్రెడ్డి పెట్టించిన భోజనాలు చేశారు.
-కమ్మర్పల్లి/ ముప్కాల్/ మెండోరా, జూలై 13
పండుగలా వ్యవసాయం చేస్తాం..
వర్షాలు రాలేవన్న బెంగ ఉండే. కాళేశ్వరం జలాలు తె చ్చి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నింపుతుండడంతో వ్యవసాయాన్ని పండగలా చే స్తాం. సాగునీళ్లు ఇవ్వడానికి సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉన్నారు. రైతులకు నీళ్లిస్తే సరిపోతుందని, వేల కోట్లు ఖర్చు పెట్టి దిగువ నుంచి ఎగువకు నీళ్లు ఇచ్చి చూపించిండు మంత్రి ప్రశాంత్రెడ్డి అన్న.
– మహేందర్, కోనాసముందర్
కాళేశ్వరం ఒక అద్భుతం..
మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంతన్న కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ప్రపంచంలో ఒక అద్భుతం చేశారు. కాళేశ్వరం నీళ్లను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నింపుతూ అద్భుతాన్ని సార్థకం చేశారు. రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకోవాలని వారి తపన. రైతుల మేలు కోరిన మీకు రుణపడి ఉంటాం.
– నరేశ్, కోనాసముందర్
కేసీఆర్ సల్లంగ ఉండాలె..
వానకాలం చాలయి నా వానలు పడక రందివడ్డం. కాళేశ్వరం నీళ్లను ఎక్కడి నుంచో తీసుకవచ్చి పోచంపాడ్ డ్యాంల నింపుతున్నరు. సీఎం కేసీఆర్ ఏమనుకున్నా చేసి సూపిస్తడు. రైతుల గురించి బాగా ఆలోచిస్తడు. గింత చేసిన కేసీఆర్ సల్లంగ ఉండాలె.
– కుకునూర్ నర్సయ్య, కోనాసముందర్
నీళ్ల రంది లేకుండా చేసిండు
ఎక్కడో ఉన్న కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి మా కోసం పోచంపాడ్ డ్యామ్లో నింపి నీళ్ల రందీ లేకుండా చేసిండు. కాళేశ్వరం నీళ్లు పెద్దపెద్ద పైపులకెళ్లి పోచంపాడ్ డ్యామ్లకు పోతుంటే చూశాం. ఈ నీళ్లే పోచంపాడ్ కెనాల్ నుంచి మా పంటలకు వస్తాయి. ఇంకా రెండు కాలాలు పంటలు వేసుకోవడానికి ఎలాంటి రంది లేదు. మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పింది చేసి చూపించిండు.
– మస్కట్ లింబన్న, రైతు, ఇనాయత్నగర్
కాళేశ్వరం రాకపోతే ఎస్సారెస్పీ ఎండుతుండే..
ఎక్కడో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను తెచ్చి పోచంపాడ్ ప్రాజెక్టులో నింపుతున్నారు. కాళేశ్వరం జలాలే రాకపోతే ఈ రోజు పోచంపాడ్ ప్రాజెక్టు ఎండిపోయేది. ప్రాజెక్టు కింద ఉన్న రైతులు ఆవేదనతో ఉండేవారు. కాలువల కింద ఉన్న ఆయకట్టు రైతులందరికీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పూర్తి భరోసాను కల్పించారు. వ్యవసాయం చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. రెండు పంటలకు నీళ్లు సరఫరా అవుతాయని ధీమాతో ఉన్నాం.
– రాజేందర్ వర్నం, అమీర్నగర్
వర్షాలు లేకున్నా నీళ్లొచ్చినయ్..
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన ఇంజినీర్ నాలెడ్జ్తో కాళేశ్వరం జలాలను వరదకాలువ గుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు తీసుకువచ్చిండు. ఈ కాళేశ్వరం జలాలతో శ్రీరాంసాగర్ నింపుతుంటే ఇన్ని రోజులు ఉన్న ఆందోళన తీరిపోయింది. సాగునీటికి ఆకాశం వైపు చూస్తున్న మాకు ప్రశాంతన్న ఏర్పాటు చేసిన ముప్కాల్ పంపుహౌస్తో కాళేశ్వరం జలాలు పోచంపాడ్లో వచ్చి పడుతుంటే వ్యవసాయానికి సమస్యే లేదు.
– లస్కర్నాయక్, ఇనాయత్ నగర్
రైతుల కల నెరవేర్చిండ్రు..
వ్యవసాయానికి కావాల్సిన నీళ్లను తెచ్చి సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతుల కల నెరవేర్చిండ్రు. ఈ అద్భుతాన్ని చూసేందుకు రెండు కండ్లు చాలుతలేవు. ఎంతో కష్టపడి ఈ కాళేశ్వరం జలాలను తీసుకొని వచ్చి రైతుల కండ్లలో ఆనందం నింపిండ్రు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ నుంచే వరద వస్తే నిండే అవకాశం ఉండే. ఇప్పుడు కింది నుంచి నీళ్లను పైకి తెచ్చి ప్రాజెక్ట్ను నింపుతున్నరు.
-సుధాకర్ సభావట్, ఇనాయత్నగర్
ఏడ విన్నా.. కాళేశ్వరం ముచ్చటే…
మా ఊర్లో ఏడ ఎవరితో మాట్లాడిన కాళేశ్వరం ముచ్చటనే వినిపిస్తున్నది. అందుకనే వచ్చి ముప్కాల్ పంపుహౌస్ను చూసినం. చాలా దూరం నుంచి కాళేశ్వరం నీళ్లను ఎదురు తీసుకవచ్చి పోచంపాడ్ ప్రాజెక్టును నింపుతున్నారు. నీళ్లు వచ్చుడు చూస్తుంటే పండుగలా అనిపిస్తుంది. కాళేశ్వరం నీళ్లు కలిసే పోచంపాడ్ గంగను చూసి మొక్కబుద్దయ్యింది.
– మంజుల లక్ష్మి, కోనాసముందర్