ఆర్మూర్, సెప్టెంబర్ 9: కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సకల జనం బీఆర్ఎస్ బాట పట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన వీడీసీ సభ్యులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, డొంకేశ్వర్ మండలం గంగాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘ సభ్యులు, చిన్నాపూర్ గ్రామానికి చెందిన మైనార్టీలు, వివిధ కుల సంఘాల సభ్యులు, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన కుమ్మరి సంఘ సభ్యులు, మామిడిపల్లికి చెందిన ఎస్ఎస్కే సర్వసమాజ్ సభ్యులు శనివారం జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జీవన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ…అభివృద్ధి , సంక్షేమానికే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు.
ఆర్మూర్ అంటేనే రైతులు, చేతి వృత్తులకు ప్రసిద్ధి అని పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రగతి బాటలో పరుగులు పెడుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు పడిన రైతులకు కేసీఆర్ పాలన అన్నదాతలకు స్వర్ణయుగం తెచ్చిందన్నారు. ఎస్సీలకు దళిత బంధు ఒక వరమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో చితికిపోయిన కుల వృత్తులకు మళ్లీ ప్రాణం పోసే కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. చేతివృత్తులకు ప్రభుత్వం బాసటగా నిలిచి జవసత్వాలు ఇస్తున్నదని తెలిపారు.రూ.20కోట్లతో సిద్దులగుట్ట ఘాట్రోడ్డు, ఆర్మూర్ అభివృద్ధికి అద్దం పట్టేలా తొమ్మిదికి పైగా బైపాస్ రోడ్ల నిర్మాణం, అర్బన్ పార్క్ నిర్మాణం తాను సాధించిన విజయాలని వివరించారు. కేసీఆర్ కాకుండా ఎవరు వచ్చినా తెలంగాణకు ముప్పేనని అన్నారు. ఎటు చూసినా కారు..సారు..కేసీఆరేనన్నారు. మళ్లీ బీఆర్ఎస్దే విజయమని, కేసీఆర్ హ్యట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అంకాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పట్టణంలోని మల్లారెడ్డి చెరువుకట్టపై కొనసాగుతున్న మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జీవన్రెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్కు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్, కౌన్సిలర్ గంగామోహన్చక్రు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజానరేందర్, సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, రవిగౌడ్, గొర్తె దేవేందర్, బాల్రెడ్డి, రింగుల భూషణ్ తదితరులు ఉన్నారు.